'అవతార్'​.. 'ధమాకా'.. 'మట్టికుస్తీ'.. బాక్సాఫీస్​ వద్ద ఈ ఏడాది ముగింపు మెరుపులు ఇవే..

author img

By

Published : Nov 25, 2022, 6:43 AM IST

upcoming movies to be released in this year end

చిరంజీవి - బాలకృష్ణ.. సంక్రాంతి బరిలో తలపడేందుకు సిద్ధమయ్యారు. పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, నాని.. వేసవి రేసుపై గురి పెట్టారు. నాగార్జున, వెంకటేష్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌.. వీరి రాక ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేం. మరి ఈ ఏడాదికి శుభం కార్డు వేసేది ఎవరు? ఇప్పుడీ బాధ్యతను అగ్ర హీరో రవితేజతో కలిసి భుజానికెత్తుకున్నారు యువ కథానాయకులు. విజయాలతో జోరు చూపాలన్నా.. మెరుపులాంటి ముగింపు అందించాలన్న వీరి చేతుల్లోనే ఉంది. మరి ఆయా తారల సినిమాల సత్తా ఎంత? ఎవరిపై ఎన్ని అంచనాలున్నాయి? తెలుసుకుందాం.

ముగింపులో అగ్రతారల మెరుపులు కనిపిస్తే ఆ ఉత్సాహం మరోస్థాయిలో ఉంటుంది. 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాలతో గతేడాది తెలుగు చిత్రసీమకు మెరుపు లాంటి ముగింపే దక్కింది. ఈసారి ఆ స్థాయిలో పెద్ద చిత్రాల సందడి కనిపించకున్నా.. వినోదాలకు ఏ లోటు లేదంటున్నారు యువ కథానాయకులు. ఎందుకంటే ఈ ఏడాదికి శుభం కార్డు వేయనుంది వీళ్లే.

ఇటీవలే 'మేజర్‌'గా పాన్‌ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు కథానాయకుడు అడివి శేష్‌. ఇప్పుడాయన 'హిట్‌2'తో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాని సమర్పణలో రూపొందిన చిత్రమిది. విజయవంతమైన 'హిట్‌' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగాన్ని తెరకెక్కించిన శేలేష్‌ కొలను ఈ రెండో భాగానికీ దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతోనే ఆసక్తిరేకెత్తిస్తున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మరి ఈ చిత్రంతో శేష్‌ తన జైత్ర యాత్ర కొనసాగిస్తారా? లేదా? తెలియాలంటే డిసెంబరు 2వరకు వేచి చూడక తప్పదు. ఇదే తేదీకి 'మట్టి కుస్తీ'తో బాక్సాఫీస్‌ బరిలో సందడి చేయనున్నారు విష్ణు విశాల్‌. ఆయన రెజ్లర్‌గా నటించిన క్రీడా నేపథ్య చిత్రమిది. చెల్లా అయ్యావు తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాణంలో హీరో రవితేజ కూడా భాగస్వామిగా ఉండటంతో దీనిపైనా ప్రేక్షకుల్లో చక్కటి అంచనాలే నెలకొని ఉన్నాయి.

మాస్‌గా రవితేజ.. క్లాస్‌గా నిఖిల్‌!
మాస్‌ యాక్షన్‌ చిత్రాలకు చిరునామా రవితేజ. ఇప్పుడాయన 'ధమాకా'తో సరికొత్త మాస్‌ యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. 'ఖిలాడి', 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రాలతో ఈ ఏడాది వరుస పరాజయాలు అందుకున్నారు రవితేజ. అందుకే ఆయన ఈ సినిమాతో విజయం దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో డిసెంబరు 23న విడుదల కానుంది. ఇదే తేదీకి '18 పేజిస్‌' రూపంలో ఓ అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు చూపించనున్నారు యువ కథానాయకుడు నిఖిల్‌. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రమిది. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ పతాకాలపై నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. 'కార్తికేయ2' వంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత నిఖిల్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వీళ్లూ వచ్చేనా?
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని.. డిసెంబర్‌లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న చిత్రాల్లో 'రంగమార్తాండ', 'అహింస', 'హంట్‌' వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రమే 'రంగమార్తాండ'. కొవిడ్‌ పరిస్థితుల వల్ల చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. డిసెంబరు మూడో వారంలో బాక్సాఫీస్‌ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

నిర్మాత సురేష్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తేజ తెరకెక్కించిన చిత్రం 'అహింస'. యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'హంట్‌'. మహేష్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌లోనే బాక్సాఫీస్‌ ముందుకు రానున్నట్లు సమాచారం.

'పంచతంత్రం' వినోదం
డిసెంబరు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాల్లో... కాస్త అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా 'పంచతంత్రం'. ఐదు కథల సమాహారంగా హర్ష పులిపాక తెరకెక్కించిన చిత్రమిది. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, శివాత్మిక రాజశేఖర్‌, నరేష్‌ అగస్త్య, రాహుల్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆహ్లాదభరితంగా ఆకట్టుకునేలా ఉండటంతో క్లాస్‌ ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది.

అదే తేదీన 'రాజయోగం' అనే మరో చిన్న సినిమా కూడా బాక్సాఫీస్‌ బరిలో అదృష్టం పరీక్షించుకోనుంది. ఇక ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్‌ 2'. 'అవతార్‌'కు సీక్వెల్‌గా జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యంపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు ట్రేడ్‌ వర్గాల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తొలి భాగం 2.92 బిలియన్‌ డాలర్ల వసూళ్లతో ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించగా.. ఇప్పుడొస్తున్న ఈ రెండో భాగం ఏస్థాయిలో వసూళ్లు దక్కించుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది డిసెంబరు 16న బాక్సాఫీస్‌ ముందుకు రానున్న నేపథ్యంలో ఇంత వరకు ఆ తేదీపై మరో తెలుగు చిత్రమేదీ కన్నేయలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.