ఉక్రెయిన్‌ ప్రజలకు SS రాజమౌళి థ్యాంక్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో RRR రీరిలీజ్​

author img

By

Published : Mar 7, 2023, 5:25 PM IST

rrr oscar nominations

ఆస్కార్‌ను ఒడిసిపట్టేందుకు అడుగు దూరంలో ఉంది RRR చిత్రంలోని నాటునాటు పాట. అయితే ఈ పాట చిత్రీకరణలో భాగమైన ఉక్రెయిన్‌ ప్రజలకు దర్శకధీరుడు SS రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటు ఈ నెల 12న జరిగే ఆస్కార్‌ బరిలో నిలిచిన నేపథ్యంలో రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అందులో నాటు నాటు పాటను ఎందుకు ఉక్రెయిన్‌లో చిత్రీకరించాల్సి వచ్చిందో వివరించారు. ఏకంగా దేశాధ్యక్షుడైన జెలెన్‌స్కీ ఇంటివద్ద చిత్రీకరించేందుకు తనకు పూర్తి మద్దతు లభించినట్లు వెల్లడించారు.

ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించి ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచింది నాటు నాటు పాట. ఆస్కార్‌ అవార్డును గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్న ఆ పాట గురించి గతంలోనే రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆ పాటను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి వద్దే చిత్రీకరించినట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఆ పాటను ముందుగా భారత్‌లోనే చిత్రీకరించాలని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. అది వర్షాకాలం కావడం వల్ల భారత్‌లో చిత్రీకరణ సాధ్యపడదనీ ఇతర దేశాల్లో పాటను షూట్‌ చేయాలనుకున్నట్లు భావించామన్నారు.

నాటు నాటు పాట చిత్రీకరణకు భారత్‌ వెలుపల చాలా ప్రదేశాలు వెతికామని.. అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భవనం అందుకు సరిగ్గా సరిపోయిందని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. జెలెన్‌స్కీ ఇంటి రంగు, ఎత్తుతోపాటు డ్యాన్స్‌ చేసేందుకు ఆ గ్రౌండ్‌ చక్కగా ఉందని రాజమౌళి భావించారు. భద్రతాకారణాల రీత్యా అనుమతి దొరకదనీ.. ఇక ఆ భవనంపై ఆశ వదులుకున్నట్లు తెలిపారు. అయితే అధికారులు మాత్రం "ఇది ఉక్రెయిన్‌ ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు పాటను సంతోషంగా చిత్రీకరించుకోవచ్చు" అని తెలిపినట్లు రాజమౌళి వానిటీ ఫెయిర్‌ మాగజిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇప్పటికీ నాటు నాటు పాటను చూసినప్పుడల్లా తనకు కీవ్‌లోని జెలెన్‌స్కీ భవనమే గుర్తొస్తుందని రాజమౌళి చెప్పారు. ఉక్రెయిన్‌ వల్లే ఇది సాధ్యపడిందని అందుకే వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. కాగా ప్రపంచ చిత్ర పరిశ్రమనే ఉర్రూతలూగించిన ఈ పాట గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు గెలుచుకుంది. ఈ నెల 12న జరిగే ఆస్కార్‌ వేడుకల్లో ఈ పాటను గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు లైవ్‌గా ప్రదర్శించనున్నారు.

ఆస్కార్​ ప్రధానోత్సవం.. RRR రీరిలీజ్​
మరోవైపు విడుదలైన దగ్గరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అవార్డులు, రివార్డులు కొల్లగొడుతూ ఆస్కార్ బరిలో నిలిచిన రాజమౌళి RRR చిత్రం మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్​కు ఎంపికైన సందర్భంగా మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లో RRRను రీరిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అలియాభట్, అజయ్ దేవగణ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విడుదల చేస్తుండటం వల్ల అభిమానుల్లో ఉత్సాహాం నెలకొంది.

ఇవీ చదవండి : 'ఆమె నన్ను బ్లాక్​మెయిల్​ చేస్తోంది.. నా పరువు పోతే వారికి ఆనందం'

ఫ్యాన్స్​కు థ్యాంక్స్​ చెప్పిన అమితాబ్​.. నన్ను కలవడానికి ఎవరూ రావద్దంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.