వైరల్​గా చిరు ట్వీట్​ ​.. నా ఊపిరి.. గుండె చప్పుడు అన్ని వారేనంటూ..

author img

By

Published : Sep 22, 2022, 8:17 PM IST

chiru

మెగాస్టార్ చిరంజీవి సోషల్​మీడియాలో ఓ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం అది వైరల్​ అవుతోంది. అదేంటంటే..

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలుగు చిత్రసీమలో ఒక ప్ర‌భంజ‌నం. టాలీవుడ్​ను ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లిన చిరు త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించారు. ఆయ‌న డ్యాన్స్, ఫైట్స్ , యాక్ష‌న్​తో అభిమానులను మెప్పించారు. ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన నట ప్రస్థానం ప్రారంభమై నేటికి 44 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆయన సోషల్​మీడియా ద్వారా తన నట ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్​ చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

"మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టినరోజు, ఈ రోజు 22 సెప్టెంబరు 1978. 'ప్రాణం ఖరీదు' ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరి, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను" అని ట్వీట్ చేశారు.

చిరు గురించి కొన్ని విశేషాలివి..

చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాది రాళ్లు' అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ చిత్రం కంటే ముందు 'ప్రాణం ఖరీదు' విడుదలైంది. ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు పరిచయమయ్యారు చిరు. సెప్టెంబరు 22, 1978లో విడుదలైందీ సినిమా.

ఈ చిత్రంలో రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు. దీంతో పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలు అని నటుడు సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. ఇదే ఈ సినిమా కథాంశం.

  • ఆ తర్వాత.. 1979లో రిలీజైంది 'పునాది రాళ్లు' చిత్రం. ఈ సినిమా విడుదలకు ముందు 'మనవూరి పాండవులు', 'తాయారమ్మ బంగారయ్య', 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ'... వంటి పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు చిరు.
  • అవార్డులు.. శుభలేఖ, ఇంటిగుట్టు, రుద్రవీణ, ముఠా మేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ చిత్రాలకుగాను ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు చిరు. ఆపద్బాంధవుడు, స్వయం కృషి, ఇంద్రతో ఉత్తమ నటుడుగా నంది అవార్డు పొందారు.
  • అదే రోజు వందో సినిమా.. తొలి సినిమా విడుదలైన సెప్టెంబరు 22న వందో సినిమాగా తెరకెక్కిన 'త్రినేత్రుడు' 1988లో విడుదలై మంచి విజయన్ని అందుకుంది.
  • మాస్‌ ఇమేజ్‌ తెచ్చిన ఖైదీ.. 1983లో వచ్చిన 'ఖైదీ'.. చిరంజీవికి అప్పటి వరకు ఇంకెవరికి రాని మాస్‌ ఇమేజ్‌ తెచ్చి పెట్టింది. ఈ చిత్రం తర్వాత చిరు వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు.
  • పదేళ్లకు రీ ఎంట్రీ.. 149 చిత్రాల్లో స్టార్‌ కథానాయకుడిగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి ప్రవేశించారు చిరు. 2007లో విడుదలైన 'శంకర్‌ దాదా జిందాబాద్'‌ చిత్రంతో నటనకు దూరమయ్యారు. మధ్యలో 'మగధీర', 'బ్రూస్‌ లీ' చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. అభిమానుల కోరిక మేరకు, మళ్లీ నటించాలనే తపన ఆయనలో ఉండటం వల్ల 'ఖైదీ నంబరు 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అదే స్టైలు అదే జోరు అంటూ ఈ చిత్రంతో సూపర్​ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి', ఆచార్యతో మళ్లీ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం గాడ్​ఫాదర్​, వాల్తేరు వీరయ్య సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: నా ఫొటోలు చూసి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పగలరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.