నయా ఫార్ములతో టాప్​ స్టార్స్​.. కొత్తగా ప్రయత్నిస్తే వచ్చేది విజయమే!

author img

By

Published : May 26, 2023, 7:28 AM IST

heros with new trends

క్రమక్రమంగా సినీ ఇండస్ట్రీలో మార్పులు సంతరించుకుంటున్నాయి. ఒక్కప్పటి సినిమాలకు పూర్తి భిన్నంగా ఇప్పటి కథలు రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అగ్ర తారల నుంచి యువ హీరోల వరకు ఈ ట్రెండ్​ను ఫాలో అవుతూ కొత్త ప్రయోగాలకు శ్రీ కారం చుడుతున్నారు. మరీ మన టాలీవుడ్​లో ఎవరెవరు ఈ ఫార్ములాను వాడారంటే ?

ఒక్కప్పటి నుంచి ఇప్పటివరకు చిత్రసీమలో ఎన్నో మార్పులు జరిగాయి. ట్రెండ్‌ కూడా పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా ఇప్పటి సినిమాలు రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్ర కథానాయకులు ప్రయోగాలు చేయడానికి తెగువ చూపుతుంటే.. వాళ్లను ప్రోత్సహించడానికి దర్శక నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. అందుకే ఇప్పటి కాలంలో ప్రేక్షకులకు కొత్త తరహా కథలు చూసే అవకాశం దక్కుతోంది. అగ్ర తారల నుంచి అప్​కమింగ్ యంగ్​ హీరోల సినిమాల వరకు ఎన్నో చిత్రాలు వైవిధ్యతను సంతరించుకుని సరికొత్తగా వెండితెరపై కాంతులీనుతున్నాయి. దీని ఫలితంగానే తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకుంటోంది.

" ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రయోగం చేయడాన్ని ఓ సాహసోపేతంగా విషయంగా చూసేవారు. కానీ.. ఇప్పుడు ఇదే విజయ సూత్రంగా మారిపోయింది. అయితే రొటీన్‌ కమర్షియల్‌ సినిమా చేయడాన్ని నిర్మాతలే సాహసంగా చూసే పరిస్థితులొచ్చాయి". - ఇటీవలే ఓ యువ దర్శకుడు వ్యాఖ్యానించిన మాట ఇది. ఇదే అక్షర సత్యం కూడా. అయితే ఈ మార్పును అగ్ర తారలు గుర్తించి, స్వాగతిస్తున్నారు. అందుకే క్రమ క్రమంగా తమకున్న ఓల్డ్​ ఇమేజ్​ నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. 'కొత్తగా ప్రయత్నిస్తే పోయేదేముంది?' అంటూ తెగువ చూపించి నయా ట్రెండ్​కు శ్రీకారం చుడుతున్నారు. దీంతో దర్శకులు సైతం వాళ్ల ఇమేజ్‌కు తగ్గట్లుగానే వైవిధ్యభరితమైన కథలు సిద్ధం చేస్తున్నారు.

కొత్తదనం నిండిన కథలతో పాటు .. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు యువ సామ్రాట్​ అక్కినేని నాగార్జున. అందుకే ఇప్పుడు ఆయన రైటర్​ ప్రసన్న కుమార్‌ బెజవాడతో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది నాగ్‌కు ఓ కొత్త తరహా ప్రయత్నమే అని చెప్పాలి. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాతో ఆయన సరికొత్త మాస్‌ లుక్‌తో కనువిందు చేయనున్నారు. కాగా ఇందుకోసం ఇప్పటికే తన లుక్‌ను కూడా మార్చుకున్నారు నాగ్‌. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

heros with new trends
రవితేజ, నాగార్జున, రామ్​చరణ్​

ఇక ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో హిట్​ టాక్​ అందుకుని ఆ జోరును ఆస్వాదిస్తున్నారు నందమూరి బాలకృష్ణ​. ప్రస్తుతం ఆయన 'ఎఫ్​3' దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో బాలయ్యను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అనిల్‌. బాలకృష్ణ లుక్‌ నుంచి డైలాగ్స్ వరకు ప్రతి విషయంలోనూ కొత్తదనం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం అదే యాసలో బాలయ్య డైలాగ్​ డెలివిరీ ఉండనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్‌ కల్యాణ్‌ లైనప్​లో 'బ్రో' సినిమా కూడా ఒకటి. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియాలిటీ, హీరోయిజాలకు భిన్నంగా సాగనుందని సమాచారం. అయితే ఈ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రంలో పవన్‌ భగవంతుడిగా కనిపించనున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది.

heros with new trends
పవన్​ కల్యాణ్​, బాలకృష్ణ

ఇటీవలే విడుదలైన 'రావణాసుర'లో విలన్​ షేడ్స్​ ఉన్న పాత్ర పోషించి అందరినీ మెప్పించారు మాస్​ మహారాజ రవితేజ. ఇప్పుడు ఆయన 'టైగర్‌ నాగేశ్వరరావు'గా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన కెరీర్​లో ఇదే తొలి బయోపిక్‌. 70స్​లో పేరు మోసిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ.. ఆయన లుక్‌ కూడా చాలా భిన్నంగా ఉండనున్నట్లు టాక్​. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్​ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

టాలీవుడ్​ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హారర్‌ కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి సినిమాలో ప్రభాస్‌ నటించడం ఇదే తొలిసారి. అందుకే ఇందులో ప్రభాస్‌ హంగామా ఎలా ఉంటుందో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'రంగస్థలం' సక్సెస్​ తర్వాత నుంచి పూర్తిగా కొత్త రూట్​లో ప్రయానించేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా పవర్​ స్టార్​ రామ్‌చరణ్‌. దీనికి తగ్గట్లుగానే ఒక సినిమాకు మరో సినిమా పోలిక లేకుండా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌' అనే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన 'ఉప్పెన' డైరెక్టర్​ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఇది చరణ్‌కు తొలి క్రీడా నేపథ్య చిత్రమవుతుందని సమాచారం. మరి మన అగ్ర తారలు చేస్తున్న ఈ ప్రయోగాలకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాల్ని అందిస్తారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.