'నా భర్త శ్రీహరి చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు.. బాలయ్య మాత్రమే'

author img

By

Published : Sep 26, 2022, 7:43 PM IST

Updated : Sep 26, 2022, 8:54 PM IST

srihari balakrishna

తన భర్త చనిపోయాక ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు శ్రీహరి భార్య డిస్కో శాంతి. బాలకృష్ణ ఒక్కరే కాల్​ చేసి తన బాగోగులు అడిగారని గుర్తుచేసుకున్నారు.

హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా భిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు శ్రీహరి. కానీ కొన్నేళ్ల క్రితం.. అనూహ్యంగా అనారోగ్యంతో కన్నుమూశారు. రీల్‌ మీద ప్రతినాయకుడిగా చేసినప్పటికీ.. రియల్​ లైఫ్​లో ఎంతోమందికి సాయం చేసి మంచి వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. అయితే ఆయన కన్నుమూసిన తర్వాత ఎవరూ కనీసం పలకరించడానికి కూడా రాలేదని.. తమకు డబ్బులివ్వాల్సిన చాలా మంది కూడా ఎగ్గొట్టారని ఆయన భార్య డిస్కో శాంతి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన్ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తమ అప్పులు తీర్చడం కోసం నగలు, కార్లు అమ్మానని చెప్పుకొచ్చారు.

"బావ(శ్రీహరి) నటించిన సినిమాలకు.. ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ సరిగా ఇచ్చి ఉంటే.. నేను మరో పది ఇళ్లు కొని ఉండేదాన్ని. చిరంజీవితో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రం క‌రెక్ట్‌గా రెమ్యునరేషన్​ ఇచ్చేవాళ్లు. చాలా మంది డ‌బ్బులు ఇచ్చేవారు కాదు. తర్వాత ఇస్తామనే వాళ్లు. అయితే బావ‌కు సినిమా అంటే పిచ్చి. అందుకే నేను కూడా డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా పర్లేదు.. సినిమాలు చేయ‌మ‌ని చెప్పేదాన్ని. 40-50 ఏళ్లు వ‌చ్చినా తండ్రిగానో, అన్న‌గానో ఏదో ఒక వేషం వ‌స్తుంది.. ఆయనకు కూడా ఆసక్తి కదా.. అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు అడ్డు చెప్ప‌లేదు. ఇక మాకు డబ్బులు ఇవ్వాల్సిన చాలా మంది బావ చనిపోయిన తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దాంతో మేం చేసిన అప్పులు తీర్చడం కోసం నగలు, కార్లు అమ్మాను" అని చెప్పుకొచ్చారు.

"నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే.. బావ చనిపోయిన తర్వాత.. శాంతి ఏం చేస్తుందని నా గురించి ఆరా తీసేవారు.. అడిగేవారు. కానీ నేను సినిమాలకు దూరం అయ్యాను కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఇవన్ని మాములే. శ్రీహరి చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు మా ఇంటికి కాల్‌ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్‌ చేశారంట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్‌ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్‌ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాల‌కృష్ణ‌లా ఎవ‌రూ కాల్ చేయ‌లేదు" అన్నారు శాంతి.

ఇదీ చూడండి: సుమ-అనసూయ డ్యాన్స్​ చూశారా.. భలే వేశారుగా​!

Last Updated :Sep 26, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.