Vijayawada police on heroin case: హెరాయిన్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Sep 20, 2021, 10:06 AM IST

Updated : Sep 21, 2021, 3:24 AM IST

Vijayawada police on heroin case

10:04 September 20

హెరాయిన్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

హెరాయిన్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

    విజయవాడలో అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ లింక్‌లు ప్రకంపనలు రేపుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి తీసుకొస్తుండగా గుజరాత్‌లోనే పట్టుబడిన హెరాయిన్ డొంక మెల్లగా కదులుతోంది. కీలక సూత్రధారి దిల్లీ వాసేనని కేంద్ర సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అధికారులు అరెస్ట్ చేశారు. సాధారణ హోల్‌సేల్‌ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించిన సుధాకర్ సహా అతడి భార్యనూ ప్రశ్నిస్తున్నారు. ఇకహెరాయిన్‌ వ్యవహారంతో విజయవాడకు సంబంధం లేదని పోలీసులు ప్రకటన ఇచ్చారు.


   గుజరాత్‌లో దొరికిన తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిన్ మాఫియా కింగ్‌పిన్‌ దిల్లీకి చెందిన వ్యక్తేనని కేంద్ర సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి తరలిస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీ చేర్చాలనేది మాఫియా వ్యూహమని అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలకు అనుమానం రాకుండా విజయవాడ చిరునామాతో ప్రారంభించిన కంపెనీని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధరణకొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ను పావుగా వినియోగించుకుని అతని భార్య పేరుతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించినట్లు తేల్చాయి. ఈ సంస్థ పేరుతో జూన్‌లో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతైనట్లు గుర్తించారు. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకూ తరలించినట్లు తేల్చారు. ఐదు రోజుల కిందట సుధాకర్, అతని భార్య గోవిందరాజుల వైశాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మదాబాద్, దిల్లీ సహా చెన్నైలో సోదాలు నిర్వహించారు. భార్యభర్తలిద్దరితో పాటు సోమవారం మరికొందర్ని అరెస్టు చేశారు.

   గతంలో విశాఖలో ఉద్యోగం చేసిన సుధాకర్ ఎనిమిదేళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. ఓ పేరొందిన సిమెంట్‌ కంపెనీలో లాజిస్టిక్‌ మేనేజర్‌గా పనిచేశాడు. పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల వ్యవహారం, కస్టమ్స్‌ అనుమతులు సహా ఇతర అక్రమ వ్యవహారాలపై పట్టుసాధించాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ముఠాల్లో కొందరితో పరిచయమేర్పడినట్లు కేంద్ర సంస్థలు గుర్తించాయి. వారి సూచనతోనే విజయవాడలో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రారంభించాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నాయి.

   సుధాకర్ అత్తింటినే అద్దెకు తీసుకుంటున్నట్లు చూపి ఆషీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడు. బియ్యం, పండ్లు హోల్‌సేల్‌ వ్యాపారం చేసేందుకు కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు లైసెన్స్ పొందాడు. విజయవాడ చిరునామాతో కంపెనీ ఉన్నప్పటికీ సుధాకర్‌ కార్యకలాపాలేవీ ఇక్కడ ఉండేవి కాదని నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. చెన్నై కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించేవాడని తెలుస్తోంది. దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది మత్తు ముఠాల సభ్యులకు సుధాకర్ పావుగా మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన ఎగుమతి-దిగుమతి కోడ్ తమకు ఇస్తే భారీ మొత్తంలో కమీషన్‌ చెల్లిస్తామంటూ ఉచ్చులోకి లాగినట్లు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి ఎగుమతి- దిగుమతి కోడ్‌ పొంది మత్తు ముఠాల సభ్యులకు అందజేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో టెర్రర్‌ ఫండింగ్‌ ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధమూ లేదని విజయవాడ సీపి బి. శ్రీనివాసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి.. 

సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చెక్‌పోస్టుల్లో అదనపు బలగాలు మోహరింపు..

Last Updated :Sep 21, 2021, 3:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.