ఇదేమైనా సొంత జాగీరా?.. ఇష్టారాజ్యంగా పేర్లు మార్చి యూపీలా నవ్వులపాలు కావొద్దు

author img

By

Published : Sep 23, 2022, 9:37 AM IST

TAHDIGADAPA MUNICIPALITY

THADIGADAPA : పథకాలకు, విశ్వవిద్యాలయాలకు, మున్సిపాలిటీలకు ఇష్టారీతిన పేర్లు మారుస్తున్న వైకాపా ప్రభుత్వం పై ప్రజలు, సామాజిక వేత్తలు, కొందరు నాయకులు మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా పేర్లు మార్చడానికి ఇదేమైనా వారి జాగీరా అని ధ్వజమెత్తుతున్నారు. మహానుభావుల్ని, గొప్ప వ్యక్తుల్ని, జాతీయ నాయకుల్ని గౌరవించుకునే పద్ధతి ఇదేనా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

TAHDIGADAPA MUNICIPALITY : ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి.. ముఖ్యమంత్రి జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టుకోవడం, ఆ చర్యను ఆయన, మంత్రులు సమర్థించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారం పేర్లు మార్చేయడానికి ఇదేమైనా వారి జాగీరా? రేపు మరో ప్రభుత్వం వచ్చి.. మళ్లీ పేరు మారుస్తామంటే.. యూనివర్సిటీ అస్తిత్వానికి ఇబ్బంది తలెత్తదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మహానుభావుల్ని, గొప్ప వ్యక్తుల్ని, జాతీయ నాయకుల్ని గౌరవించుకునే పద్ధతి ఇదేనా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. విఖ్యాత నటుడు. విలక్షణ పాలకుడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాల్లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు, బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు లాంటి విప్లవాత్మక సంస్కరణల్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి. అనేక ప్రముఖ విద్యా సంస్థల్ని ఏర్పాటుచేసి నవశకానికి నాంది పలికారు.

హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయన హయాంలో ఏర్పాటు చేసినవే. వైద్య విద్యకు దేశంలోనే తొలిసారి ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. అందుకే ఆయన గౌరవార్థం యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. అలాంటి వ్యక్తి పేరు మార్చడాన్ని వైకాపా తప్ప మిగతా అన్ని పార్టీలు, వివిధ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. కొందరు వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులూ ఆంతర్గత చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

పాత పేర్లు పాయే వైఎస్సార్​ పేరు వచ్చే: వైకాపా అధికారంలోకి వచ్చాక పాత పథకాలు, ప్రాజెక్టుల పేర్లన్నీ మార్చేసి వైఎస్సార్‌, జగన్‌ పేర్లు పెడుతున్నారు. ‘ఆ పథకాలేమైనా జగన్‌ సొంత డబ్బుతో అమలు చేస్తున్నారా? ఇష్టానుసారం పేర్లు పెట్టడానికి రాష్ట్రమేమైనా వారి జాగీరా?’ అని వివిధ పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. విజయవాడలో భాగంగా ఉన్న తాడిగడప పంచాయతీని జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక మున్సిపాలిటీగా చేసి దానికి ‘వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ’ అని పేరు పెట్టింది. ‘దేశంలో ఏ మున్సిపాలిటీకీ వ్యక్తుల పేర్లు ఉండవు. ఈ సంప్రదాయం వైఎస్‌ పేరుతోనే మొదలైంది’ అని తెదేపా నాయకులు దుయ్యబడుతున్నారు.

కడప జిల్లాకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వైయస్‌ఆర్‌ కడప అని పేరు పెట్టింది. జగన్‌ మాత్రం కడప అనే పేరు తీసేసి కేవలం వైయస్‌ఆర్‌ జిల్లాగా మార్చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ‘వైయస్‌ఆర్‌ ప్రదేశ్‌’ అని పేరు పెట్టినా ఆశ్చర్యం లేదని సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు సరి కదా.. దాన్ని ఆర్థికంగా కుంగదీసింది. దాని నిధులు రూ.400 కోట్లు లాగేసుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరునూ తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాల దృక్పథం ఉండాలి కదా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వ హయాంలో అనేక స్టేడియాలు, పార్కుల నిర్మాణం జరిగింది. వాటికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకుల పేర్లు పెట్టింది. జూబ్లీహిల్స్‌లో జాతీయ పార్కుకు కాసు బ్రహ్మానందరెడ్డి పేరు.. యూసుఫ్‌గూడలోని స్టేడియానికి కోట్ల విజయభాస్కరరెడ్డి పేరు, మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి మర్రి చెన్నారెడ్డి పేర్లు పెట్టారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

తెలంగాణలో వైఎస్‌ పేరు తొలగించలేదుగా?

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) యూనివర్సిటీకి వైఎస్‌ మరణానంతరం అప్పటి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. విభజన తర్వాత.. తెరాస ప్రభుత్వం అదే పేరు కొనసాగిస్తోంది. ఆంధ్రా ప్రాంత నాయకుడి పేరు ఎందుకని తీసేయలేదు. తెలంగాణలో అనేకచోట్ల వైఎస్సార్‌ విగ్రహాలున్నాయి.

వైద్య విద్యంటే చిన్న పిల్లల ఆటా?

రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతో విద్యార్థులకు పట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మారిన పేరుతో పట్టాలివ్వాలి. రేపు ప్రభుత్వం మారి మళ్లీ పేరు మారిస్తే ఆ పేరుతో పట్టాలు వస్తాయి. ఇలా పదేపదే పేర్లు మారిస్తే దేశ, విదేశాల్లో యూనివర్సిటీ ప్రతిష్ఠేం కావాలి?

యూపీలా నవ్వులపాలు కాకూడదు

ఒక యూనివర్సిటీ పేరు పదేపదే మార్చి అపకీర్తి మూటగట్టుకున్న ఘనత ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికే దక్కింది. లఖ్‌నవూలోని కింగ్‌జార్జి మెడికల్‌ యూనివర్సిటీని 1911లో ఏర్పాటు చేశారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ దాని పేరును పదేపదే మార్చాయి. 2002లో మాయావతి ప్రభుత్వం ఛత్రపతి సాహూజీ మహరాజ్‌ మెడికల్‌ యూనివర్సిటీగా మార్చేసింది. 2003లో ఎస్పీ ప్రభుత్వం మళ్లీ కింగ్‌జార్జి యూనివర్సిటీగా మార్చింది. 2007లో బీఎస్పీ, 2012లో ఎస్పీ రావడంతో మళ్లీమళ్లీ పేరు మారింది. రాష్ట్రంలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికీ అదే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని ఎయిమ్స్‌లకు పలువురి పేర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను.. గుర్తింపు పోతోందంటూ ఎయిమ్స్‌ ఫ్యాకల్టీ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తోంది. మరి యూనివర్సిటీ పేరు మారిస్తే దాని అస్తిత్వానికి భంగం ఏర్పడదా?

జిన్నాపై ఉన్న గౌరవం ఎన్టీఆర్‌పై లేదా?

గుంటూరులోని జిన్నా టవర్‌ పేరు మార్చాలని ఇటీవల భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక భద్రత కల్పించింది. అదే పేరు కొనసాగించడంతో పాటు, దానిని కాపాడేందుకు జాతీయ పతాకంలోని 3 రంగులు వేసింది. సీఎం జగన్‌కు, వైకాపా ప్రభుత్వానికి జిన్నాపై ఉన్నంత గౌరవం కూడా ఎన్టీఆర్‌పై లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.