ఆ పని కూడా చేయలేని ముఖ్యమంత్రి సింహమా..? తెదేపా మహిళా నేతల ధ్వజం

author img

By

Published : May 14, 2022, 6:09 AM IST

tdp book on harassment of women under ysrcp

మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్‌ని వైకాపా నేతలు సింహంతో పోల్చడం విడ్డూరంగా ఉందని తెలుగు మహిళలు మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై జరిగిన అరాచకాలపై ఇటీవలే ఒక పుస్తకాన్ని ప్రచురించిన తెదేపా.. ఆ తర్వాత జరిగిన ఘటనలతో ‘జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది-2’ పేరుతో ప్రచురించిన మరో పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో మధ్యతరగతి జీవనం ఎలా దుర్భరమైందీ, ప్రజలపై వైకాపా ప్రభుత్వం వచ్చాక వేసిన వివిధ ఛార్జీల మోతల గురించి వివరించారు.

‘ఒక యువతిపైనో, మహిళపైనో అత్యాచారం చేసి చంపేశారని తెలిస్తేనే జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది జగన్‌ పాలనలో చిన్న పిల్లలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా వైకాపా నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసిన దుర్మార్గుల్ని కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేసే మంత్రులుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం’ అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆడబిడ్డల మాన, ప్రాణాల్ని పోలీసులు కాపాడలేకపోతే, సొంతంగా రక్షణ కల్పించుకునేందుకు వారికి తుపాకి లైసెన్సులైనా ఇవ్వాలని మహిళా నేతలు డిమాండు చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్‌ని వైకాపా నేతలు సింహంతో పోల్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై జరిగిన అరాచకాలపై ఇటీవలే ఒక పుస్తకాన్ని ప్రచురించిన తెదేపా.. ఆ తర్వాత జరిగిన ఘటనలతో ‘జగన్‌మోసపురెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది-2’ పేరుతో మరో పుస్తకాన్ని ప్రచురించింది. దాన్ని తెదేపా మహిళా నేతలు అనిత, మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి, పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, ఆచంట సునీత, అన్నాబత్తుని జయలక్ష్మి పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మే 12 వరకు రాష్ట్రంలో మహిళలు, ఆడ పిల్లలపై 60 అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయన్నారు. ‘గంటా... అరగంటా... అని కామెంట్లు చేసినా తాను బాధపడనని మంత్రి రాంబాబు ట్వీట్‌ చేశారు. అత్యాచారాలు చేసిన నిందితుల్ని ఆఫీసులో కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేసే పరిస్థితికి దిగజారిన మీరు ఎందుకు బాధపడతారు?’ అని అనిత నిప్పులు చెరిగారు. ‘జగన్‌ అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీని నం.1 చేస్తానని చెబితే... ఉద్యోగావకాశాల కల్పనలోనో, మౌలిక వసతుల అభివృద్ధిలోనో అనుకున్నామే తప్ప... ఇలా నేరాలు, ఘోరాల్లో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌నీ దాటేసి ఏపీని నం.1 చేస్తారని అనుకోలేదు. జాతీయ క్రైమ్‌ రికార్డుల బ్యూరో వివరాల ప్రకారమే నేరాలు, ఘోరాల్లో దక్షిణ భారతంలో ఏపీ నం.1గాను, మహిళల అక్రమ రవాణాలో దేశంలో నం.2గాను నిలిచింది’ అని ఆమె ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాక్షస రాజ్యం: ‘రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళను హోం మంత్రిని చేసినందుకు సంతోషించాలో, అసమర్థ నేతను ఆ పోస్టులో పెట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు’. -ప్రతిభాభారతి, తెదేపా నాయకురాలు

మీకెలా నిద్ర పడుతోంది: ‘మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి, హోం మంత్రి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌లకు నిద్రెలా పడుతోంది? మీకు చీమ కుట్టినట్టూ లేదా? సొంత చెల్లిని, తల్లిని రోడ్డుపై వదిలేసిన ముఖ్యమంత్రి మాకేదో చేస్తారన్న నమ్మకం లేదు. పోలీసుల్ని ఒకటే అడుగుతున్నాం. ఈ అరాచకాల్ని మీరు అరికట్టలేకపోతే.. మాకే తుపాకీ లైసెన్సులు ఇవ్వండి’ అని కావలి గ్రీష్మ అన్నారు.

మహిళలపై ఇటీవల జరిగిన అత్యాచారాలు, హత్యలకు సంబంధించి పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని ఘటనలు:

  • ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేక వీధుల్లో భిక్షమెత్తుకునే 15 ఏళ్ల ఎస్సీ బాలికపై 10 మంది మృగాళ్లు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. సీఎం జిల్లాలో ఇది రెండో ఘటన.
  • 2022 ఏప్రిల్‌ 16: బతుకుతెరువు కోసం ఒడిశా నుంచి వచ్చిన ఒక మహిళపై గురజాలలో రెండేళ్ల కుమారుడు పక్కన ఉండగానే అత్యాచారం చేశారు.
  • 2022 ఏప్రిల్‌ 19: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక స్థితి సరిగాలేని యువతిని ముగ్గురు దుర్మార్గులు బంధించి 30 గంటలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
  • 2022 ఏప్రిల్‌ 28: గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఇంట్లో నిద్రపోతున్న వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు
  • 2022 మే 1: రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఎస్సీ మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.
  • 2022 మే 3: విజయనగరం జిల్లా మెంటాడలో పిల్లల ఎదుటే ఒక మహిళపై కానిస్టేబుల్‌ కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు.
  • 2022 మే 5: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు.
  • గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన 13 ఏళ్ల ఎస్సీ బాలికపై 80 మంది అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పడానికి ఇది నిదర్శనం.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్‌ కుమార్ మీనా నిమామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.