చంద్రబాబు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం: తెదేపా

author img

By

Published : May 11, 2022, 1:17 PM IST

TDP LEADERS FIRE

TDP LEADERS FIRE: తెదేపా ముఖ్యనేతలనే వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరోసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణీలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

TDP LEADERS FIRE ON YSRCP: ప్రభుత్వ చేతకానితనంతో చంద్రబాబు కుటుంబసభ్యుల్ని అక్రమ కేసుల్లో ఇరికించి ఆనందించాలనుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరోసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్రలు ధ్వజమెత్తారు. ఇప్పటికే నారా భువనేశ్వరిని వ్యక్తిగతంగా దూషించి ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ భువనేశ్వరి, బ్రాహ్మణిలను అక్రమ కేసులో ఇరికించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్​ని చేర్చారని మండిపడ్డారు. మంగళగిరిలో తరచూ పర్యటిస్తున్న లోకేశ్​​కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే ఆయన కుటుంబసభ్యులపైనా ఎమ్మెల్యే ఆర్కే అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.

గతంలో రాజధానిలో అక్రమాలంటూ కొండని తవ్వి ఎలుక తోక కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవటం తప్ప ఏం చేయలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు, నారాయణపై పెట్టిన తప్పుడు కేసులలో కొందరు అధికారులు శృతిమించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుటుంబానికి నోటీసులిస్తామంటూ లీకులతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అసలు దోషుల్ని వదిలేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు, అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరించారు.

ఇవీ చదవండి: ASANI CYCLONE: "అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.