ప్రభుత్వ అరాచకాలు తట్టుకోలేక వైకాపా నేతలు తెదేపాలో చేరుతున్నారన్న చంద్రబాబు

author img

By

Published : Aug 19, 2022, 7:37 PM IST

Updated : Aug 19, 2022, 8:09 PM IST

cbn on jagan

CBN ON JAGAN రాష్ట్రంలో వైకాపా నేతల రౌడీయిజం పరాకాష్టకు చేరిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలను ఆ పార్టీ నేతలే తట్టుకోలేక తెదేపాలో చేరుతున్నారని తేల్చిచెప్పారు. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన 5 సంఘటనలు పరిశీలిస్తే రాష్ట్రం ఎటుపోతుందోననే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

CHANDRABABU ON YSRCP: ఓ ఎంపీ నగ్న వీడియో బయటకు వస్తే.. ఆడబిడ్డల గౌరవం గురించి ముఖ్యమంత్రి ఆలోచించలేదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎంపీని సమర్థిస్తూ వీడియో ఫేక్ అని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలు ఇష్టానుసారం నోరు పారేసుకుంటే.. సంస్కారం ఉన్నవాళ్లు భయపడిపోతారన్నట్లు వైకాపా నేతల తీరుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసుల ఉన్మాదంతో ఇష్టానుసారం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. రౌడీయిజానికి అంతా భయపడిపోవాలన్నట్లు కొందరి పోలీసుల ప్రవర్తన ఉందని ఆక్షేపించారు.

ప్రభుత్వ అరాచకాలు తట్టుకోలేక వైకాపా నేతలు తెదేపాలో చేరుతున్నారన్న చంద్రబాబు

కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: కులం పేరు ఎత్తిన వారికి.. చెప్పు తీసి చూపాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా ఒక్కటైతేనే బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఎదురుదాడితో చేసిన తప్పుల్ని సమర్థించుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కులముద్ర వేసి అంశాన్ని మళ్లించటం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విధానాలను ప్రశ్నిస్తున్నారని కాపులను తిడుతున్నారు.. మరి రేపు రెడ్లు ప్రశ్నిస్తే వారినీ తిడతారని అని ప్రశ్నించారు. విదేశీ విద్యకు అంబేడ్కర్​ పేరును తొలగించి తన పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్ అని నిలదీశారు. అన్ని కులాలు నావే అనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. తాను పోటీ చేసిన కుప్పుంలో కూడా తన కులం వాళ్లు పెద్దగా లేరని, చేసిన మంచి చూసే తనని గెలిపించారని వెల్లడించారు.

వైకాపా వల్లే పోలవరానికి నష్టం: ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం.. పరాకాష్టకు చేరిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం వైకాపా ప్రభుత్వమేనని పీపీఏ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం ముందుగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నారని, నివేదికలు వచ్చాక కేంద్రాన్నే తప్పు పడుతున్నారని మండిపడ్డారు. పోలవరం గుత్తేదారుల్ని మార్చే తొందరపాటు నిర్ణయం తగదని కేంద్రం సహా ఎవ్వరు చెప్పినా వినకుండా ముందుకెళ్లటంతోనే ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు పనుల వల్లే రెండు కాఫర్ డ్యాంల మధ్యలో నీరు చేరటంతో పాటు డయాఫ్రం వాల్ కూడా దెబ్బతిందని ఆరోపించారు.

ముఖ ఆధారిత హాజరు: టీచర్లపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది కాబట్టే ముఖ ఆధారిత హాజరు యాప్ తెచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాల్సి వస్తుందనే పాఠశాలల్ని విలీనం చేసేస్తున్నారని ఆక్షేపించారు. పేద విద్యార్థులకు స్కూళ్లను దూరం చేశారని మండిపడ్డారు. నాన్న బుడ్డి వాస్తవం, అమ్మ ఒడి బూటకమని దుయ్యబట్టారు.

వైకాపా దాడులు: రాష్ట్రంలో మనిషి ప్రాణం కోడి కంటే చులకనైపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో తమకు నచ్చని వాళ్లను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారని మండిపడ్డారు. అరటి తోటలు తగెలేస్తే, ఎంపీ బట్టలు ఊడదీసుకుని తిరిగితే కేంద్రంలో మంత్రి అయిపోతారన్నట్లు వైకాపా తీరుందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గురించి అదే కులం వాళ్లతో తిట్టిస్తున్నారని, మరొకరితో తనని తిట్టిస్తున్నారని ఆరోపించారు. ఏ కులంలో పేదరికం ఉంటే ఆ కులానికే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

5 సంఘటనలు: నెల్లూరులో ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్ శవమై తేలాడని వాపోయారు. ఏలూరు జిల్లాలో వైకాపా ఎంపీటీసీని వేధించి తప్పుడు కేసులు పెడితే సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. పల్నాడులో ముగ్గురాయి వ్యాపారం కోసం వైకాపా నేతలు బహిరంగంగా ఘర్షణలకు దిగారని గుర్తు చేశారు. ఉయ్యూరులో వైకాపా జెడ్పీటీసీ పూర్ణిమ గౌరవప్రదమైన మహిళలు ఉండలేరంటూ పదవికి రాజీనామా చేశారన్నారు.

తెదేపాలో చేరిక: గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన గుదిబండ గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ భవన్​లో పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రైతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే భావన అన్ని వర్గాల ప్రజల్లో ఉందని గుదిబండ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున రైతు సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారని ఆరోపించారు. ఒక ఆశయం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు గుదిబండ ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 19, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.