బార్ల ఈ-వేలంలో వ్యాపారుల సిండికేట్‌.. వ్యవహారమంతా వారి కనుసన్నల్లోనే !

author img

By

Published : Aug 1, 2022, 4:16 AM IST

బార్ల ఈ-వేలంలో వ్యాపారుల సిండికేట్‌

రాష్ట్రంలో బార్ల లైసెన్స్ రెండో విడత ఈ వేలంలో అత్యధిక చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం ప్రారంభ ధరపై 2లక్షలు, 4 లక్షల రూపాయలకు మించి పాడకూడదని అందరూ కూడబలుక్కున్నారు. ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన బార్ల ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా 597 కోట్ల 35లక్షల మేర ఆదాయం లభించింది. సిండికేట్ కాకుండా ఉంటే మరో వంద కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు ఆదాయం సమాకూరేదని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్‌శాఖ ఆదివారం నిర్వహించిన రెండో విడత ఈ-వేలంలో అత్యధిక చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం ప్రారంభ ధరపై (అప్‌సెట్‌ ప్రైస్‌) అదనంగా రూ.2 లక్షలు, రూ.4 లక్షలకు మించి పాడకూడదంటూ కూడబలుక్కున్నారు. కొందర్ని ప్రలోభపెట్టి, మరికొందర్ని భయపెట్టి పోటీ నుంచి తప్పించారు. ఇంకొందరితో రాజీ చేసుకుని వేలంలో పాల్గొనకుండా చేశారు. ఈ వ్యవహారమంతా ఆయా ప్రాంతాల్లోని వైకాపా ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే నడిచింది. చివరికి వారు అనుకున్నట్లుగా అతి తక్కువ మొత్తాలకే బార్ల లైసెన్సులను దక్కించుకున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, ఏలూరు తదితర నగరాలు మొదలు పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. అత్యధిక శాతం బార్లను అధికార పార్టీ నాయకులే కైవసం చేసుకున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 494 బార్లకు ఎక్సైజ్‌శాఖ ఆదివారం రెండో దశ ఈ-వేలం నిర్వహించింది.

వేలంలోనే పాల్గొనకుండా చేశారు..

  • రెండో విడతలో 679 మంది వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఆదివారం నిర్వహించిన ఈ-వేలంలో 629 మందే పాల్గొన్నారు. మిగిలిన 50 మందిని వేలంలో పాల్గొనకుండా చేయటంలో స్థానిక వైకాపా నాయకుల నేతృత్వంలోని సిండికేట్లు కీలకంగా వ్యవహరించాయి.
  • కాకినాడ నగర పాలక సంస్థలో మొత్తం 11 బార్లకు వేలం వేయగా.. 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. వేలంలో 11 మందే పాల్గొన్నారు. అధికార పార్టీ ముఖ్య నాయకుడి నేతృత్వంలో మిగతా ఏడుగురిని పోటీ నుంచి తప్పించారు. ఇక్కడ బార్ల వేలం కోసం ప్రభుత్వం కనీస ధరను రూ.35 లక్షలుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొన్నవారు దానికి రూ.2 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. అయితే ఈ బార్లలో ఒక్కటే రూ.39 లక్షలకు పాడారు. మిగతా వాటిని రూ.37 లక్షలకే దక్కించుకున్నారు.
  • తాడేపల్లిగూడెంలో అప్‌సెట్‌ ప్రైస్‌ రూ.35 లక్షలు. ఇక్కడ రూ.37 లక్షలు, రూ.39 లక్షలకే దక్కించుకున్నారు.

విజయవాడ, గుంటూరు, నెల్లూరులలో ముందే కుమ్మక్కు: రెండో దశలో ఈ-వేలం నిర్వహించిన 494 బార్లలో 212 విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరపాలక సంస్థల పరిధుల్లోనే ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనూ అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ 3 నగరాల్లోనూ అప్‌సెట్‌ ప్రైస్‌ రూ.50 లక్షలు. విజయవాడలో గరిష్ఠంగా రూ.54 లక్షలు, కనిష్ఠంగా రూ.52 లక్షలకు, గుంటూరులో గరిష్ఠంగా రూ.56 లక్షలు, కనిష్ఠంగా రూ.54 లక్షలకు, నెల్లూరులో గరిష్ఠంగా రూ.58 లక్షలకు లైసెన్సులను దక్కించుకున్నారు. అప్‌సెట్‌ ధరపై రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకే అదనంగా పెంచి పాడారు. నెల్లూరు, గుంటూరు నగరాల్లో మెజారిటీ బార్లు వైకాపా నాయకులకే దక్కాయి. విజయవాడలోనూ సగానికిపైగా బార్లు వైకాపా నేతలు, వారి సంబంధీకులే దక్కించుకున్నారు.

మార్కాపురం, దర్శిల్లో అత్యధికంగా రూ.1.47 కోట్లు: కొన్నిచోట్ల బార్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 10 బార్లు వేలంలో రూ.కోటి కంటే ఎక్కువ పలికాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అప్‌సెట్‌ ధర రూ.35 లక్షలు కాగా, దర్శిలో రూ.15 లక్షలు. ఈ రెండు చోట్ల భారీ పోటీ ఏర్పడటంతో రూ.1.47 కోట్లకు వేలం పాడారు. రెండో విడతలో రాష్ట్రంలో ఇదే అత్యధికం. బాపట్ల జిల్లా అద్దంకి నగర పంచాయతీలో రూ.1.37 కోట్లకు, నెల్లూరు జిల్లా కందుకూరులో రూ.1.15 కోట్లకు వేలం పాడి బారు లైసెన్సులను పొందారు. అద్దంకిలో అప్‌సెట్‌ ధర రూ.15 లక్షలు. కందుకూరులో అప్‌సెట్‌ ధర రూ.35 లక్షలు.

  • విజయవాడ శివార్లలోని తాడిగడప మున్సిపాలిటీలో అప్‌సెట్‌ ధర రూ.35 లక్షలుకాగా గరిష్ఠంగా రూ.97 లక్షలకు వేలం పాడి ఓ వ్యాపారి లైసెన్సు దక్కించుకున్నారు.
  • చింతలపూడిలో అప్‌సెట్‌ ధర రూ.15 లక్షలుకాగా రూ.99 లక్షలకు వేలం పాడారు.

ఆదాయానికి గండి: రెండు రోజులపాటు నిర్వహించిన బార్ల ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా రూ.597.35 కోట్ల ఆదాయం లభించింది. తొలిరోజు శనివారం నాటి వేలంలో రూ.258 కోట్ల ఆదాయం రాగా.. ఆదివారం నిర్వహించిన వేలంలో రూ.339 కోట్ల ఆదాయం లభించింది. తొలిరోజు వేలంలో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొనటంతో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఆదివారం వేలంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సిండికేటుగా మారిపోవటంతో ఎక్సైజ్‌శాఖ ఆశించినంత ఆదాయం సమకూరలేదు. వేలంలో పాల్గొన్నవారు కుమ్మక్కవకుండా ఉంటే మరో రూ.100 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల్లో మొత్తం 838 బార్లకు వేలం నిర్వహించగా.. 815 బార్లకు లైసెన్సులు ఖరారయ్యాయి. మరో 23 బార్లు మిగిలిపోయాయి. వాటికి త్వరలో మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.