pension problems : ‘ఏ నెలకు ఆ నెలే పింఛను’ నిబంధనతో కష్టాలు

author img

By

Published : Oct 11, 2021, 8:03 AM IST

‘ఏ నెలకు ఆ నెలే పింఛను’ నిబంధనతో కష్టాలు

‘ఏ నెలకు ఆ నెలే’ పింఛను(pension) మొత్తాన్ని తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనతో పలువురు పింఛనుదారులు నష్టపోతున్నారు. ఒక నెల తీసుకోకపోతే మరుసటి నెల ఆ మొత్తాన్ని ఇవ్వబోమని ప్రభుత్వం(government) స్పష్టం చేయడంతో వారు తీవ్ర మనోవ్యథకు గురవుతున్నారు. సెప్టెంబరు నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రావడంతో వలస కార్మికులు, దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. వివిధ సమస్యల రీత్యా పింఛను తీసుకునేందుకు అటు ఉండలేక... ఇటు సకాలంలో తమ ప్రాంతానికి వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లోని శివారు గ్రామాల్లో ఉన్న వలస కార్మికులు పనులకు ఎక్కువగా బెంగళూరు, చెన్నైకి వెళుతుంటారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరు ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా వెళుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయ కోతలు, ఇతరత్రా పనులకు వెళ్లి రెండు, మూడు నెలలకు ఒకసారి తిరిగి స్వగ్రామాలకు వస్తుంటారు. గతంలో రెండు, మూడు నెలలకు కలిపి పింఛను తీసుకునే వెసులుబాటు ఉండటంతో వీలుకలిగినప్పుడు వచ్చి పింఛను తీసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొంతమంది వృద్ధులు దూర ప్రాంతాల్లో బిడ్డల చెంత ఉంటున్నారు. పింఛను కోసం వారు ప్రతి నెలా రావాల్సి ఉంది.

స్వగ్రామాలకు రాలేక, అక్కడే ఉండలేక...

అలాంటి వారు.. వచ్చినా పింఛను మొత్తంలో సగం ఛార్జీలకే వెచ్చించాల్సిన పరిస్థితి. వారి వెంట జతగా మరొకరు వస్తే రాకపోకలకే సరిపోతుంది. అలాగని వరుసగా మూడు నెలల తీసుకోకపోతే రద్దవుతోంది. స్వగ్రామాలకు రాలేక, అక్కడే ఉండలేక దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పండుగలకు తమ బిడ్డల దగ్గరకు వెళ్లి కొంత కాలం వారి వద్దే ఉండాలనే ఆలోచన ఉన్నవారూ ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలకు భయపడి స్వగ్రామాలకు వెళ్లలేని వారూ ఉన్నారు. వాలంటీర్లు ఫోన్‌ చేసి సమాచారమిచ్చినా.. తాము వచ్చే పరిస్థితి లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.

సెప్టెంబరులో తీసుకోలేని వారు 1.2లక్షల మంది...

రెండు నెలల పంపిణీని పరిశీలిస్తే నెలకు పింఛను తీసుకోని వారి సంఖ్య లక్ష వరకు ఉంది. సెప్టెంబరు నెలలో 1.20 లక్షల మంది పింఛను తీసుకోలేదు. వీరిలో కొందరు చనిపోయిన వారు కూడా ఉన్నారు. పింఛను తీసుకోని వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అక్టోబర్‌ నెల పంపిణీని పరిశీలిస్తే... చివరి రోజైన గత సోమవారం సాయంత్రానికి పింఛను మొత్తాన్ని తీసుకోని వారి సంఖ్య లక్ష వరకు ఉంది. ఇలా... ప్రతి జిల్లాలోనూ 5 నుంచి 10 వేల మంది పింఛను తీసుకోలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.25 కోట్ల వరకు మిగలనుందని అంచనా.

* ఇక అనారోగ్య సమస్యల కారణంగా నెల మొదటి వారంలో ఆసుపత్రుల్లో ఉన్న వారికి పింఛను మొత్తం అందని పరిస్థితి ఉంది. అక్టోబరు నెల పింఛను పంపిణీని పరిశీలిస్తే వైద్య పింఛన్లు 92 శాతం మందికి మాత్రమే అందించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.