జనసేనను చూస్తే వైకాపా శ్రేణుల్లో వణుకు మొదలైంది: పవన్​ కల్యాణ్​

author img

By

Published : Sep 3, 2022, 4:47 PM IST

PAWAN FIRES ON POLICE

PAWAN WARNS TO POLICE : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్​ అరెస్ట్​ను ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి.. అనుమతి లేదన్న సాకుతో పోలీసులు అడ్డుపడడం అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

PAWAN FIRES ON POLICE : విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్​ను జనసేన జెండా ఆవిష్కరణ చేయకుండా వైకాపా నేతలు, పోలీసులు అడ్డుపడిన వైనం, రిమాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను.. అర్ధరాత్రి వైకాపా దౌర్జన్యకారులు జెసీబీతో కూల్చివేశారన్నారు. ఈ ఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి.. అనుమతి లేదనే సాకుతో పోలీసులు అడ్డుపడడం.. అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మెలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా అని నిలదీశారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే సదుద్దేశ్యంతోనే ఇంత జరుగుతున్నా తాను రోడ్ మీదకు రాలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తను రోడ్డెక్కడం తప్పదదని హెచ్చరించారు. పోలీసులు సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారు. మరో ప్రభుత్వం వస్తే తలదించుకునే పరిస్థితి రాకూడని కోరుకుంటున్నానని, ధర్మాన్ని పాటించమని అధికారులను కోరారు.

విజయవాడలో జనసేన నేత అరెస్ట్​: విజయవాడ వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్ సమీపంలో జనసేన దిమ్మని కొందరు వైకాపాకు చెందిన వ్యక్తులు తొలగించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జనసేన కార్యకర్తలు వారితో గొడవకు దిగి ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు. జనసేన కార్యకర్తలను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పోలీసులను ప్రశ్నించారు. దాంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. పోలీసులు పోతిన మహేష్​ను అదుపులో తీసుకుని.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుట్రతోనే జనసేన పార్టీ దిమ్మలకు రంగులు పూయడం, తొలగించడం చేస్తున్నారంటూ మహేష్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.