Mukkoti Ekadasi Celebrations: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

author img

By

Published : Jan 13, 2022, 4:22 AM IST

Updated : Jan 13, 2022, 6:44 AM IST

mukkoti ekadasi celebrations

Mukkoti Ekadasi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమలలో స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే కొవిడ్ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనాలు రద్దు చేసినట్లు కొన్ని ఆలయాల పాలకమండలి ప్రకటించింది.

Mukkoti Ekadasi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆలయాలల్లో వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ఆయా ఆలయాల అధికారులు ప్రకటించారు.

శ్రీవారిని దర్శించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ

తిరుమలలో బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్ల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.2కోట్ల విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన డీడీలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌కు అందజేశారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ దంపతులు, హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ రమేష్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు జయరామ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, రంగనాథరాజు, సురేష్‌, బాలినేని, అనిల్‌ యాదవ్‌ దంపతులు, అవంతి శ్రీనివాస్‌ దంపతులు, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీపార్వతి, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు దంపతులు, మరో మంత్రి గంగుల కమలాకర్‌ స్వామి వారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ప్రముఖులకు దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. గురువారం నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు. ఏకాదశి పురస్కరించుకుని గురువారం ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.

ఇదీ చదవండి..

Tirumala Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. ముస్తాబైన తిరుమల

Last Updated :Jan 13, 2022, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.