Power Crisis: రాష్ట్రంలో విద్యుత్ కొరత... పరిశ్రమలకు సరఫరాలో కోత!

author img

By

Published : Oct 13, 2021, 5:20 AM IST

Power Crisis

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కొరతను అధిగమించటానికి పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోతలు పెట్టాలని ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. ఆ మేరకు వివిధ పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు జరుపుతున్నాయి. పరిశ్రమలో ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ను పొదుపు చేయటానికి ఏసీలు, ఇతర అనవసర వినియోగాన్ని తగ్గించాలని కోరాయి.

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కొరతను అధిగమించటానికి పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోతలు పెట్టాలని ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. పీక్‌ డిమాండ్‌ సమయంలో (సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటలు) వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకునేలా (సుమారు వెయ్యి మెగావాట్లు) వివిధ పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు జరుపుతున్నాయి. పరిశ్రమలో ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ను పొదుపు చేయటానికి ఏసీలు, ఇతర అనవసర వినియోగాన్ని తగ్గించాలని కోరాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో రోజూ 2వేల మెగావాట్ల విద్యుత్‌ కొరత ఉంది. దీన్ని అధిగమించటానికి సుమారు వెయ్యి మెగావాట్ల ఉత్పత్తిని పెంచుకొని మరో వెయ్యి మెగావాట్ల వినియోగాన్ని తగ్గించటం ద్వారా సర్దుబాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే లోడ్‌ సర్దుబాటు కోసం గ్రామాల్లో రోజూ పీక్‌ లోడ్‌ సమయంలో కనీసం గంటపాటు సరఫరాలో కోత విధిస్తున్నాయి.

కోతలు పెడితే కష్టమే

కొవిడ్‌ పరిస్థితులనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమలకు విద్యుత్‌ కోత విధిస్తే కోలుకునే పరిస్థితి ఉండదని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్‌ (జనరేటర్లు) వినియోగించాలంటే పెరిగిన డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుంటే సాధ్యం కాదన్నారు. మోస్తరు కంపెనీ కూడా ఉత్పత్తి నిలిచిపోకుండా ఉండటానికి కనీసం 2గంటలపాటు జనరేటర్‌ వినియోగిస్తే కనీసం రూ.30 వేలు అదనంగా భరించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. విద్యుత్‌ ఖర్చుతో పోలిస్తే దాదాపు 10రెట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. రాష్ట్రంలో వినియోగించే 185 ఎంయూల విద్యుత్‌లో పరిశ్రమల వినియోగం 25 శాతం (సుమారు 50 ఎంయూలు) ఉంటోంది.

అదనపు ఉత్పత్తికి చర్యలు

  • పీ జెన్‌కో థర్మల్‌ యూనిట్ల ద్వారా 5010 మెగావాట్ల విద్యుదుత్పత్తి కావాలి. ప్రస్తుతం వాటినుంచి సుమారు 2,200 మెగావాట్లు వస్తోంది. ఆర్‌టీపీపీలో మరో యూనిట్‌, ఇతర యూనిట్లలో సామర్థ్యాన్ని పెంచటం ద్వారా 500 మెగావాట్లు అదనంగా ఉత్పత్తికి అధికారులు ప్రతిపాదించారు.
  • కడపలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఆర్‌టీపీపీ)నుంచి 2యూనిట్లను వార్షిక నిర్వహణ కోసం నిలిపేశారు. బొగ్గు కొరత కారణంగా మరో 2యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేశారు. దీంతో 1650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ప్లాంట్ల నుంచి కేవలం 375 మెగావాట్లు మాత్రమే వస్తోంది.
  • విజయవాడలోని వీటీపీఎస్‌లో 1760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ప్లాంట్లనుంచి 1,220 మెగావాట్లు వస్తోంది. ఒక యూనిట్‌ను వార్షిక నిర్వహణ కింద నిలిపేశారు. ఇక్కడ 29,895 ఎంటీల బొగ్గు నిల్వలున్నాయి.
  • కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల సామర్థ్యమున్న 2యూనిట్లలో బొగ్గు కొరత కారణంగా కొన్ని నెలలుగా ఒక యూనిట్‌ మాత్రమే పని చేసింది. విద్యుత్‌ డిమాండ్‌తో రెండో యూనిట్‌ను మంగళవారంనుంచి ప్రారంభించారు. ప్రస్తుతం 2యూనిట్లనుంచి 663 మెగావాట్ల విద్యుత్‌ వస్తోంది. బుధవారానికి సుమారు వెయ్యి మెగావాట్లకు చేరుతుందని అధికారులు తెలిపారు. సుమారు 85వేల ఎంటీల బొగ్గు ఉండటంతో అయిదారు రోజుల వరకు ఇబ్బంది లేదని తెలిపారు.

నెలపాటు ఇదే సమస్య

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ప్రస్తుతం రోజుకు 185-190 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) మధ్య ఉంటోంది. బహిరంగ మార్కెట్‌నుంచి సుమారు 40 ఎంయూలు కొన్నా కొరత తీరటం లేదు. విద్యుత్‌ కొనుగోలు కోసం యూనిట్‌కు సగటున రూ.7-8 వంతున డిస్కంలు వెచ్చిస్తున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు బహిరంగ మార్కెట్‌లో అధిక ధర వెచ్చించి విద్యుత్‌ కొంటున్నాయి. ధరలు భారీగా పెరగటానికి ఇదో కారణమని ఒక అధికారి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న విద్యుత్‌ సమస్య కొలిక్కి రావటానికి కనీసం మరో నెల పడుతుందని అంచనావేశారు.

విద్యుదుత్పత్తి తీరు

....

దేశంలోని విద్యుదుత్పత్తిలో థర్మల్‌ విద్యుత్‌ కీలకంగా మారింది. మొత్తం అన్ని రకాల విద్యుత్కేంద్రాల ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంలో థర్మల్‌ వాటా దేశవ్యాప్తంగా 62, తెలంగాణలో 62.98, ఏపీలో 45 శాతం చొప్పున ఉన్నాయి.

.....

ఇదీ చదవండి

Power Crisis in AP: రాష్ట్రంలో విద్యుత్ కొరత.. రంగంలోకి డిస్కమ్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.