క్షణికావేశంలో చెన్నుపాటిపై దాడి.. మారణాయుధాలు వాడలేదు: కాంతిరాణా

author img

By

Published : Sep 4, 2022, 8:22 PM IST

Updated : Sep 5, 2022, 6:17 AM IST

CP Kanthi Rana

CP on Chennupati Issue: చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి వివరాలను విజయవాడ సీపీ కాంతిరాణా వెల్లడించారు. ఈ దాడిని వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పలువురిని ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

Chennupati Gandhi: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీని చేతులతో కొట్టడంవల్లే కంటికి గాయమైందట! ఇనుపచువ్వతో పొడిచినట్లు ఆధారాలే లేవట. ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో వాగ్వాదం చోటుచేసుకుని క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలో ఆయన కంటికి గాయమైందట. ఇప్పటివరకూ చేపట్టిన దర్యాప్తులో ఇదే తేలిందట! విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా విలేకరులతో చెప్పిన మాటలివి. బాధితుడి కంటి నుంచి రక్తం ధారకట్టి.. ఆయన ధరించిన తెల్లచొక్కాపై రక్తపు మరకలున్నా.. అవి చేత్తో కొట్టిన గాయం వల్లేనని సీపీ అంటున్నారు! దాడికి పాల్పడినవారు వైకాపా నాయకులు కావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో వారిని తప్పించేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.

అప్పటికప్పుడు పదునైన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి?
శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. ఆదివారం మధ్యాహ్నం వరకూ కేసే నమోదు కాలేదు. తెదేపా నాయకులు ఏసీపీ కార్యాలయానికి వెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే తప్ప కేసు పెట్టలేదు. వైకాపా నాయకులు మారణాయుధాలతో దాడి చేసి తనను అంతమొందించేందుకు యత్నించారని గాంధీ ఫిర్యాదు చేసినా.. అసలు హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షనే పెట్టలేదు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి (ఐపీసీ 326), నేరపూరిత బెదిరింపు (ఐపీసీ 506) సెక్షన్లకే పరిమితమయ్యారు. హత్యాయత్నం సెక్షను ఎందుకు జోడించలేదని విలేకరులు సీపీని ప్రశ్నించగా.. ‘పిడికిలితో కొట్టడంవల్ల కంటికి గాయమైంది. ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులూ ఇదే విషయం చెప్పారు. గాంధీ శరీరంపై పదునైన ఆయుధంతో గాయాలేమీ లేవు. హత్య చేయడానికి నిందితులకు ఒక ఉద్దేశం.. ప్రణాళిక ఉన్నప్పుడే హత్యాయత్నం సెక్షన్‌ పెడతారు’ అని సమాధానమిచ్చారు. ఉద్దేశం, ప్రణాళిక లేకపోతే అప్పటికప్పుడు పదునైన ఆయుధాలు ఎలా వచ్చాయనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేదు.

కళ్ల ముందే గాయం కనిపిస్తుంటే.. కేసు పెట్టడానికి న్యాయసలహా అట
వైకాపా నాయకులు తనపై హత్యాయత్నం చేశారని, ఆ దాడిలో గాయపడ్డానని ఘటన జరిగిన వెంటనే పోలీసులకు గాంధీ ఫిర్యాదు చేశారు. అందుకు తార్కాణంగా ఆయన కంటిపై గాయమూ ఉంది. ప్రత్యక్ష సాక్షులూ దాడి జరిగిందని చెబుతున్నారు. కానీ పోలీసులకు అవేవీ పట్టలేదు. న్యాయసలహా, వైద్యుల నివేదిక పేరిట కేసు నమోదులో జాప్యం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాతా దానిని బయటకు రానివ్వలేదు. సీపీ ప్రెస్‌మీట్‌లోనూ నిందితుల పేర్లు చెప్పలేదు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారనే చెప్పారు. తనపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని వారి పేర్లతో సహా గాంధీ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నా... ఇద్దరినే నిందితులుగా చేర్చారు. గాంధీపై దాడి చేయించిన తొమ్మిదో డివిజన్‌ వైకాపా ఇన్‌ఛార్జి వల్లూరి ఈశ్వర్‌ప్రసాద్‌ను కేసు నుంచి తప్పించారని, అందుకే నిందితుల పేర్లు వెల్లడించట్లేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

మద్యం తాగుతూ రెక్కీ?
గాంధీపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. కృష్ణలంక నుంచి కొందరిని వైకాపా నాయకులు తెప్పించారని చెబుతున్నారు. వీరు పది రోజులుగా గాంధీ ఇంటికి సమీపంలో ఉన్న ఆశ్రమం గ్రౌండ్‌లో మద్యం తాగుతూ రెక్కీ నిర్వహించారంటున్నారు. దాడి రోజూ వారు అక్కడే మద్యం తాగి, గాంధీ కదలికల సమాచారం చేరవేసినట్లు స్థానికులు, తెదేపా నాయకులు చెబుతున్నారు.

ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం: కాంతి రాణా టాటా, పోలీసు కమిషనర్‌
‘ఒకరికొకరు ఎదురుపడి క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలో గాంధీ కంటికి గాయమైంది. ఐపీసీ 326, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం. ఇనుపచువ్వతో కంట్లో పొడిచినట్లు, రాడ్డుతో కొట్టినట్లు ఆధారాలు లేవు. కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. పిడికిలితో కొట్టటం వల్లే కంటికి గాయమైందని ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు నివేదిక ఇచ్చారు. త్వరలో ప్రభుత్వ వైద్యుల్ని హైదరాబాద్‌కు పంపించి వారి నుంచి నివేదిక తెప్పించుకుంటాం. ఘటనా స్థలంలో ఏడుగురు ఉన్నట్లు తేలింది.’

వైకాపా వారే ఉండుంటారు
విలేకరి: గాంధీపై దాడికి పాల్పడిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నారంటున్నారు? వారు ఏ పార్టీకి చెందినవారు?
కమిషనర్‌: అవును ఉన్నారు. వైకాపా, తెదేపా నాయకుల మధ్య కదా గొడవ జరిగింది.. రాజకీయ కోణంలో జరిగిందని అంటున్నారు. కాబట్టి సహజంగా వైకాపా నాయకులు ఉండుంటారు.

చెన్నుపాటి గాంధీపై దాడి వివరాలను వెల్లడిస్తున్న విజయవాడ సీపీ

చెన్నుపాటి గాంధీ విషయంలో అసలేం జరిగిందంటే: తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో.. బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.

తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడలో కార్పొరేటర్‌గా గాంధీ 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 9 డివిజనుకు ఆయన భార్య కాంతిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 9వ డివిజన్‌లో పైపులైను లీకేజీపై ఫిర్యాదులు అందితే ...దగ్గరుండి కార్పొరేషన్‌ సిబ్బందితో ఆయన పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నేతలు అక్కడికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం హయాంలో నీ పెత్తనమేంటంటూ వాగ్వాదానికి దిగారు. ఆ డివిజన్‌కే చెందిన వైకాపా అధ్యక్షుడు గద్దె కళ్యాణ్, వైకాపా ఇంఛార్జ్‌ వల్లూరి ఈశ్వరప్రసాద్, కార్యకర్త సుబ్బుతో పాటు మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ముష్టి ఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో అతని కుడికన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుపడటంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. చెన్నుపాటి గాంధీని ద్విచక్రవాహనంపై తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు.

ప్రణాళికా ప్రకారమే చెన్నుపాటి గాంధీపై దాడి చేసినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవిత ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో అంతా కలిసి వేడుకలు చేసుకునేవారు. ఈ మధ్య పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో చవితి వేడుకలు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో రాజకీయ కక్షతో దాడి చేశారనే మండిపడుతున్నారు.

ఇవీ చదవండి.

Last Updated :Sep 5, 2022, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.