CORONA CASES RISING AGAIN IN AP: వణికిస్తున్న ఒమిక్రాన్‌.. క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

author img

By

Published : Jan 12, 2022, 4:49 AM IST

AGAIN CORONA CASES RISING  IN AP

CORONA CASES RISING AGAIN IN AP: రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ఒమిక్రాన్‌ కేసులే ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల పంపిన వంద నమూనాల్లో 80 ఒమిక్రాన్‌ వేరియంట్‌విగా తేలడం తీవ్రతకు అద్దం పడుతోంది. కేసుల పెరుగుదల దృష్ట్యా.. తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు.

CORONA CASES RISING AGAIN IN AP: రాష్ట్రంలో మూడో దశ కొవిడ్ వ్యాప్తి వేగవంతమైంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. వీటిల్లో అత్యధిక కేసులు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు చెందినవేనని తెలుస్తోంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో పాటు... ర్యాండమ్‌గా స్థానికుల నుంచి సేకరించి.. ఇటీవల పంపిన సుమారు వంద నమూనాలను... హైదరాబాద్‌లోని సీసీఎంబీ పరీక్షించగా.. 80 శాతం వరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసినట్లు తేలింది. ప్రస్తుతం డెల్టా కంటే.. ఒమిక్రాన్‌ వ్యాప్తి.. ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. ప్రజల్లో ఈ వేరియంట్‌ వ్యాప్తి క్రమంగా పెరిగిపోతోందని కొవిడ్ నియంత్రణ పర్యవేక్షణ సీనియర్ వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒమిక్రాన్‌ బారినపడ్డ వారి వివరాలను చివరిగా.. ఈ నెల 5వ తేదీన వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అప్పటికి రాష్ట్రంలో 28 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఒమిక్రాన్‌ కేసుల లెక్కలపై ప్రకటనలు వెలువడలేదు.

వణికిస్తున్న ఒమిక్రాన్‌.. క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో గత నెల 27వ తేదీ నుంచి.. జనవరి 9 వరకు.. 864 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. విజయవాడ జీజీహెచ్ లో కరోనా ఓపీకి... అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి.. అలాగే పాజిటివ్ బాధితులతో సన్నిహితంగా మెలిగామని వచ్చిన వారి నుంచి... 150 నమూనాలు సేకరించారు. జనవరి 1కి ముందు ఆ సంఖ్య 15 నుంచి 25 మధ్య ఉంది. జనవరి 1 నాటికి రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57 శాతం ఉండగా.... అది మంగళవారానికి 5.01 శాతానికి పెరిగింది. స్వల్ప వ్యవధిలోనే పెరిగిన పాజిటివిటీ రేటును పరిశీలిస్తే.. సంక్రాంతి పండుగ తర్వాత కొవిడ్ మరింత ఉద్ధృతమవుతుందని.. వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. కృష్ణా, విశాఖ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు 5 శాతం దాటుతాయని అంచనా వేస్తున్నారు.

డెల్టా రకంతో పోలిస్తే.. ఒమిక్రాన్‌లో తక్కువ లక్షణాలున్నా.. వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌లో గొంతు, ముక్కులో ఇన్ఫెక్షన్, తలనొప్పి వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు తక్కువగా ఉన్నాయి. కొందరికి వైరస్‌ సోకిన విషయం కూడా తెలియడంలేదు. ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడం వంటి సమస్యలు దాదాపుగా లేవని వైద్యులు చెబుతున్నారు. అయినా.. కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. కరోనా నిబంధనల్ని తప్పక పాటించాలని.. అలసత్వం వహించవద్దని వైద్యులు, అధికారులు.. ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. ఆస్పత్రుల్లో ఏర్పాట్ల పట్ల వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ బాధితులకు ఆసుపత్రిలోని 50 శాతం పడకలు కేటాయించాలని.. ఆరోగ్యశ్రీ అధికారులు సూచించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే బాధితులకు ఉచితంగా కొవిడ్ చికిత్స చేయాలన్నారు. 50 శాతం కన్నా ఎక్కువ మంది బాధితులు వచ్చినపుడు.. ఆసుపత్రిలో పడకలు ఖాళీ ఉంటే ఆరోగ్యశ్రీ ఉన్న వారికి కేటాయించాలని ఆసుపత్రులకు సూచించారు. 100 పడకలు పైన ఉన్న ఆసుపత్రులు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

Corona cases in AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.