'కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..'

author img

By

Published : Aug 6, 2022, 6:28 PM IST

1

TS CM KCR ON NITI AAYOG: ఆదివారం దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. నీతిఆయోగ్‌తో దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించామన్నారు. కానీ.. నీతిఆయోగ్‌ ఇప్పుడు నిష్క్రియకపరత్వంగా, నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

CM KCR boycott NITI Aayog Meeting: రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకు నిరసనగా.. రేపు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా బాధాకరమే అయినప్పటికీ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు వివరించారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

భాజపా ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతిఆయోగ్‌ తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్​ వివరించారు. నీతి ఆయోగ్‌ను టీమ్‌ ఇండియా అని పిలుస్తామని ప్రధాని చెప్పినట్టు గుర్తు చేశారు. నీతిఆయోగ్‌తో దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించామన్నారు. కానీ.. నీతిఆయోగ్‌ ఇప్పుడు నిష్క్రియకపరత్వంగా, నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. దేశచరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారని.. అందులో దాదాపు 800 మంది రైతులు చనిపోయారని బాధపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సాగుకు నీరు, విద్యుత్తు దొరకట్లేదన్న కేసీఆర్​.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందన్నారు. నిత్యావసరాల ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ కూలీలు దేశ రాజధానిలో ధర్నా చేస్తే దుస్థితి వచ్చిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతోందని.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందన్నారు.

"రేపు దిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదు .కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల మా నిరసనను తెలుపుతున్నా. లేఖ ద్వారా ప్రధానికి నేరుగా నా నిరసన తెలియజేస్తున్నా. నీతిఆయోగ్‌తో దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించాం. నీతిఆయోగ్‌ ద్వారా సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. నీతిఆయోగ్‌ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరిగింది..? నీతిఆయోగ్‌ ఇప్పుడు నిష్క్రియకపరత్వంగా మారింది. నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారింది. నీతిఆయోగ్‌ సిఫారసులకు కూడా కేంద్రం గౌరవం ఇవ్వట్లేదు. నీతి ఆయోగ్‌కు ప్రధాని వద్ద గౌరవం సున్నా. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు బాగున్నాయని నీతి ఆయోగ్‌ చెప్పింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. నీతిఆయోగ్‌ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని చెప్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. మేము చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం అనే పరిస్థితికి వచ్చారు. కేంద్రం విధానాల వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువుపోతోంది. నీతిఆయోగ్‌ రూపకల్పనలో ఎవ్వరి ప్రమేయం ఉండదు." - సీఎం కేసీఆర్‌

kcr fires on modi: దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా? అని ప్రశ్నించారు. రాజ్యంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పన్నుల వసూలులో రాజ్యాంగంపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయన్న కేసీఆర్... రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్ల నిధులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ప్రగతిలో దూసుకెళ్తున్నరాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్‌ సమావేశాల్లో చెప్పానని గుర్తు చేశారు. దేశం మొత్తానికి విద్యుత్‌, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో నీతిఆయోగ్‌ సమావేశాల్లో చెప్పానని తెలిపారు. ఆ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా సమయం నిర్ణయిస్తారని చెప్పారు. వాళ్లు చెప్పేది మాత్రం వింటూ.. పెట్టే పల్లికాయలు తింటూ.. కూర్చొవాలి తప్ప ఏం ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు.

మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశమంతా ఏక్‌నాథ్‌ శిందేలు వస్తారని బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా?. ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు. పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గుజరాత్‌లో చేసే గార్భా అనే సంప్రదాయ నృత్యం మీద కూడా పన్ను వేశారు. - కేసీఆర్, ముఖ్యమంత్రి

10lakh New pensions in telangana: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందని వివరించారు. 57 ఏళ్ల వయస్కులకు పింఛన్లు మంజూరు చేస్తున్నమని చెప్పారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 ఇస్తామని తెలిపారు. వజ్రోత్సవ వేళ సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.