TTD: శాస్త్రప్రకారమే తిరుమలలో పూజలు, ఉత్సవాలు

author img

By

Published : Oct 14, 2021, 10:01 PM IST

Updated : Oct 15, 2021, 5:42 AM IST

ttd filed affidavit at supreme cour

తిరుమల ఆలయ ఆచారాల్లో లోటుపాట్లు లేవని సుప్రీంకోర్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తెలిపింది. ఆలయ ఆచారాల్లో తప్పులు దొర్లుతున్నాయని భక్తుడు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తితిదే అఫిడవిట్‌ దాఖలు(ttd filed affidavit at supreme court) చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, సేవల్లో లోపాలు లేవని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో తితిదే తెలియజేసింది. అన్నీ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తున్నట్లు పేర్కొంది. తిరుమలలో అభిషేకం, ఆర్జితసేవ, మహా లఘుదర్శనంతో పాటు పలు పూజల్లో సంప్రదాయాలను పాటించట్లేదని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. గతనెల 29న విచారించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. దాంతో తితిదే తరఫున ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారు.

‘శ్రీరామానుజాచార్య పదో శతాబ్దంలో ప్రారంభించిన వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్ల పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రంపై పూర్తి పట్టున్న అర్చకులు శ్రీవేంకటేశ్వరుని సేవలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సేవలు, ఉత్సవాల్లో లోటుపాట్లు లేకుండా శ్రీరామానుజాచార్య వ్యవస్థలను ఏర్పాటుచేశారు. వెయ్యేళ్లుగా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోంది. అర్చకులకు సలహాలు, మతసంబంధ కార్యక్రమాలు చేపట్టేందుకు తితిదే ఎప్పటికప్పుడు పండితులతో కూడిన ఆగమ సలహామండలిని నియమిస్తోంది. అర్చకులు, పూజారులు, మతసంబంధమైన సిబ్బంది పూర్తి భక్తిప్రపత్తులు, విశ్వాసంతో విధులు నిర్వహిస్తున్నారు. పిటిషనర్‌ అభ్యంతరాలపై ఆగమ సలహామండలి నివేదిక కోరాం. ఆ వివరాలు సమర్పిస్తున్నాం.’

అభిషేక సమయంలో....
శుక్రవారం వివస్త్రంగా శ్రీవేంకటేశ్వరునికి అభిషేకం చేస్తున్నారనే పిటిషనర్‌ ఆరోపణను తిరస్కరిస్తున్నాం. పాలాభిషేకం సమయంలో కౌపీనంగా పిలిచే తెల్లని వస్త్రం శ్రీవేంకటేశ్వరునికి అలంకరిస్తున్నాం. ఆర్జిత బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహనాన్ని మాడవీధుల్లో ఊరేగించడం లేదన్నారు. ప్రజల కోసం గరుడ, హనుమంత, శేష వాహనాలతో కూడిన ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తితిదే ప్రారంభించింది. ఊరేగింపు లేకుండా మూడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇచ్చేలా దాన్ని రూపొందించాం.

శ్రీవారి పాదాలు..
మహాలఘు దర్శనం సమయంలో శ్రీవారి పాదాలను చూడనివ్వడం లేదనే పిటిషనర్‌ ఆరోపణ వాస్తవదూరం. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి దర్శనం సేవ, ఉత్సవం కాదు. దర్శనానికి సగటున రోజుకు లక్షమంది వస్తారు. ఎక్కువమంది శ్రీవారిని దర్శించుకునేలా తితిదే 2006లో మహా లఘుదర్శనం ప్రారంభించింది. ఇందులో కోట్లమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎవరూ అభ్యంతరం తెలపలేదు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి పాదాలు తులసి ఆకులతో కప్పి ఉంటాయి. అందువల్ల శ్రీవారి చెంతకు వెళ్లినా పాదాలు చూడలేరు. పిటిషనర్‌కు ఆగమశాస్త్రంపై అవగాహన లేదు. నిరాధార ఆరోపణలతో తితిదే ప్రతిష్ఠ, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

TIRUMALA: అశ్వ వాహనంపై శ్రీవారి దర్శనం... రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

Last Updated :Oct 15, 2021, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.