కరుణాకర్ పిల్లల బాధ్యత నాదే.. కుటుంబానికి నారా లోకేశ్​ హామీ

author img

By

Published : Sep 7, 2022, 10:48 PM IST

Etv Bharat

Nara Lokesh: ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ప్రశ్నించిన పాపానికి దళితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. కావలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి.. పిల్లల చదువు బాధ్యత తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు.

Nara Lokesh met Karunakar Family: కరుణాకర్​ పిల్లల బాధ్యత తానే చూసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వైకాపా నేతల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇటీవల లేఖ రాసి దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ చనిపోయిన విషయం తెలిసిందే. లోకేశ్​ను చూసిన కరుణాకర్ కుటుంబసభ్యులు బోరున విలపించారు. వైకాపా నాయకులు తన భర్తను వేధించటం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని లోకేశ్​​కి కరుణాకర్ భార్య వివరించింది. కరుణాకర్ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని లోకేశ్​ భరోసానిచ్చారు. లోకేశ్​ అప్పు చెల్లించి.. కరుణాకర్ తనఖా పెట్టిన ఆస్తి దస్తావేజులను విడిపించారు. ఆ దస్తావేజులను స్వయంగా ఆయనే కరుణాకర్ కుంటుంబానికి అందించారు. ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తానే చూసుకుంటానని లోకేశ్​ హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న దళితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని లోకేశ్​ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చంపి, హింసించిన ఏ ఒక్క కేసులోనూ వైకాపా నేతలకు శిక్ష పడలేదని దుయ్యబట్టారు.

నారా లోకేశ్​

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న దళితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జగన్ పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. దళితులను చంపి, హింసించిన ఏ ఒక్క కేసులోనూ వైకాపా నేతలకు శిక్ష పడలేదు. ఎందరో పేదల్ని చంపిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. రాష్ట్రానికే నేర రాజధానిగా నెల్లూరుని తయారు చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నెల్లూరులో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది -నారా లోకేశ్​, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

అంతకుముందు తెదేపా ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు 500కార్లతో ర్యాలీగా లోకేశ్ వెంట రాగా.. మంగళగిరి నుంచి కావలి పర్యటనకు బయలుదేరారు. లోకేశ్‌కు అడుగడుగునా తెదేపా నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గుంటూరులోని ఏటుకూరు బైపాస్ వద్ద జిల్లా తెలుగుదేశం నేతలు సాదర స్వాగతం పలికారు. 79అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయంలో లోకేశ్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు తరలివచ్చి జాతీయ రహదారిపై లోకేశ్‌కు అపూర్వ స్వాగతం పలికారు. మార్టూరులో తెదేపా శ్రేణులతో ఏలూరి సాంబశివరావు లోకేశ్‌కు ఎదురువచ్చి సత్కరించారు. తోవగుంట వద్ద లోకేశ్​కు డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. మోచర్ల వద్ద భారీ క్రేన్​తో గజమాల వేసి కందుకూరు ఇన్​చార్జ్​ ఇంటూరి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. తెట్టు జంక్షన్ వద్ద సోమిరెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, అజీజ్​లు ఘనస్వాగతం పలికారు. కావలి బైపాస్ నుంచి ముసునూరు వరకు తెలుగుదేశం శ్రేణులు భారీ వాహనర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.