YS Konda Reddy: "ఒరేయ్‌ బట్టలూడదీసి కొడతా.. ఊరు వదిలిపోతావా లేదా?"

author img

By

Published : Aug 31, 2022, 10:12 AM IST

YS Konda Reddy

YS Konda Reddy: "ఒరేయ్‌... బట్టలూడదీసి కొడతా!. ఊరు వదిలిపోతావా.. లేదా.. రికార్డు చేసి సీఎంకు పంపు చూద్దాం." ఇది వైఎస్‌ కొండారెడ్డి బెదిరింపుల పర్వం. మళ్లీ పులివెందులలోకి ప్రత్యక్షమైన కొండారెడ్డి తమ పార్టీలోని ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తూ హల్​చల్​ చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు.

YS Konda Reddy: సీఎం జగన్‌ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైకాపా మాజీ ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డి మళ్లీ నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై బెదిరింపులకు దిగిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ వ్యక్తిని బూతులు తిడుతూ.. తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘నారంగేంటో చూపిస్తా.. కొండారెడ్డితో తగులుతానంటావా? వైఎస్‌.భాస్కర్‌రెడ్డి చిన్నాన్నను పొరపాటుగా ఓ మాట మాట్లాడా.. దాన్ని నువ్వు రికార్డు చేసి సీఎం సర్‌కు పంపావు. నా వాయిస్‌ను రికార్డు చేస్తావా! ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్‌ గతే నీకూ పట్టిస్తాం. డేట్‌ ఫిక్స్‌ చేయి!. నీ కథ, నా కథ తేల్చుకుందాం. నువ్వు చక్రాయపేట వదిలిపెట్టి వెళ్లాలి. నడిరోడ్డుపై నీ బట్టలిప్పి కొట్టకపోతే..’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. ‘దీన్ని రికార్డు చేసి సీఎంకు పంపురా.. చూద్దాం. చెత్త నా..’ అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కొండారెడ్డి మూడు నెలల తరువాత తిరిగి రావడం, బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది.

కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి రాయచోటి వరకు పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. వాటిని చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ గుత్తేదారును మే 5న కొండారెడ్డి కమీషన్‌ కోసం బెదిరించినట్లు ఫిర్యాదులందాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సీఎం జగన్‌.. ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో అదే నెల 10న పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండురోజుల్లోనే బెయిల్‌ లభించింది. తర్వాత కలెక్టరు, ఎస్పీ సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర హెచ్చరికలు చేశారు. కొండారెడ్డి జిల్లా బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ ప్రకటించారు. కానీ అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. అప్పటి నుంచి మూడు నెలలుగా కొండారెడ్డి జిల్లాలో కనిపించలేదు. ఇటీవలే మళ్లీ వచ్చారు. తాజాగా వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని వైకాపా నేత వేల్పుల రామలింగారెడ్డి (రాము) సచివాలయం, ఇతర కార్యాలయాల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని చూసి అభినందించారు. ఈ భవనాన్ని సెప్టెంబరు 1న సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. సరిగ్గా సీఎం పర్యటనకు ముందు ఆయన నియోజకవర్గంలో ప్రత్యక్షమై హడావుడి చేయడం చర్చనీయాంశమైంది. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ విషయమై వివరణ కోరగా.. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, అక్కడ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.