'చెత్త పన్నుపై ప్రజల్లో వ్యతిరేకత.. వసూళ్లు నిలిపేయండి'

'చెత్త పన్నుపై ప్రజల్లో వ్యతిరేకత.. వసూళ్లు నిలిపేయండి'
MLA Ravindranatha Reddy: ‘నగరపాలక, పురపాలక ఎన్నికలు అయిపోయాయి. ఇక ఎమ్మెల్యేలమైన మేము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. క్లాప్ పథకం కింద సేవలు అందించకుండా మూడు, నాలుగు నెలల బకాయిలతో సహా చెత్తపన్ను వసూలు చేస్తుండడంతో నగర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ వసూళ్లు నిలిపేయండి’ అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు.
MLA Ravindranatha Reddy: వైయస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నా చెత్త పన్ను వసూళ్లతో వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఎవరో ఎవరితోనో అగ్రిమెంటు చేసుకుంటే దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం నగరపాలక సంస్థకు లేదు. క్లాప్తో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. చెత్తపన్ను వసూళ్లు ఆపేయండి’ అని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ పథకంపై సీడీఎంఏ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, పురపాలకశాఖ మంత్రి తదితరులతో ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, మేయర్ సురేష్బాబుతో కలిసి చర్చిస్తామన్నారు. అప్పటి వరకు అధికారులు చెత్తపన్ను వసూళ్లను నిలిపేయాలని కోరారు.
కడప నగరపాలికలోని కొలుములపల్లి కంపోస్ట్యార్డులో లక్ష టన్నుల చెత్త బయోమైనింగ్ పనులను మేయర్ ముందస్తు అనుమతితో చేపట్టాలని నిర్ణయించడంపై కోర్టును ఆశ్రయించాలని ఆయన ఈ సమావేశంలో కార్పొరేటర్లకు సూచించారు. క్లాప్ పథకంపై ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన ఒప్పందం ఏమిటో తెలీదు, ఏమీ తెలీకుండా దీన్ని ఎలా అమలు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గుత్తేదారుతో చేసుకున్న ఒప్పందంతో పాటు నగరపాలక సంస్థతో ప్రత్యేకంగా అగ్రిమెంట్ చేసుకున్నారా అని అడిగారు. పింఛన్ల నుంచి చెత్తపన్ను వసూలు చేస్తున్నారని తెలిసి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
