వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. నిధులు లేక స్థానిక సంస్థలు పట్టించుకోవడం లేదు. మరో పక్క తాగునీటి సరఫరా విభాగం చేతులెత్తేసింది. చక్రాయపేట మండలం ఎర్రగుడి పంచాయతీ బి.ఎన్.తాండలో గత 10 రోజులుగా తీవ్ర నీటి ఎద్దడితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి చిత్రావతి నది నుంచి రక్షిత మంచినీటి పథకం నిర్మించి పైపులైన్లు అమర్చారు. అయితే నీటి కనెక్షన్లు ఇవ్వకుండా గుత్తేదారు బిల్లులు చేసుకుని వెళ్లిపోయారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాంతో గ్రామానికి కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న చేతి పంపు నుంచి బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఆ చేతిపంపులోనూ గంటకే నీరు ఖాళీ అవుతోంది. ఊట పెరిగే వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా రాత్రింబవళ్లు నీటి కష్టాలు పడుతున్నాం’ అని చెప్పారు. ఎర్రగుడి ఎస్సీ కాలనీలోనూ ఇదే సమస్య. ఇలాంటి పరిస్థితి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నెలకొంది. ‘ఓట్లేశాం కదా.. మా సమస్యలు ఎందుకు పట్టించుకోరు’ అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తమను బానిసలుగా చూస్తున్నారని, గ్రామానికి రహదారి సౌకర్యం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరసన.. పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై తెదేపా ఆదివారం నిరసన చేపట్టింది. ఎమ్మెల్సీ బీటెక్ రవి బి.ఎన్.తాండకు చేరుకుని మహిళలతో కలిసి నీటి బిందెను మోసి నిరసన వ్యక్తం చేశారు. ‘పది రోజుల కిందట ఈ గ్రామానికి వచ్చా. తాగు నీటి సమస్యను గుర్తించా. వారం రోజుల గడువు ఇచ్చా. పరిష్కారం కాకపోవడంతో గ్రామానికి వచ్చి నిరసన చేపట్టా. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) నుంచి లేదా ఎంపీ అవినాశ్రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి పనులు చేపట్టే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. సీఎం జగన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని నిరసన చేపట్టాం’ అని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: