Jagan Tribute at YSR: "భౌతికంగా దూరమైనా... ఆయన జ్ఞాపకాలు అలాగే నిలిచి ఉన్నాయి"

author img

By

Published : Sep 2, 2022, 12:23 PM IST

CM jagan

Jagan Tribute at YSR: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారని కొనియాడారు.

Jagan Tribute at YSR: దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వై.ఎస్.ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఇడుపులపాయ వైఎస్సార్​ ఘాట్​కు చేరుకున్న సీఎం జగన్, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతోపాటు భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. సమాధిపై షర్మిల, జగన్ వేర్వేరుగా పూలమాల నివాళులు అర్పించారు. అరగంట పాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తన నాన్న భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయని అన్నారు. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారని గుర్తు చేశారు. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటిచెప్పారన్నారు. ప్రతి అడుగులో నాన్నే స్ఫూర్తిగా ఇకపైనా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం జగన్​ స్పష్టం చేశారు.

"నాన్న భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారు. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటిచెప్పారు. ప్రతి అడుగులో నాన్నే స్ఫూర్తిగా ఇకపైనా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది." -సీఎం జగన్​

ప్రార్థనలు పూర్తయిన అనంతరం విజయమ్మ, షర్మిల ముందుగా నివాళులు అర్పించి బయటికి వెళ్లిపోగా... జగన్ వారి తర్వాత బయటికి వెళ్లారు. ఘాట్ వద్దకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను జగన్​ ఆప్యాయంగా పలకరించారు. పలువురు స్థానికులు తమ సమస్యలను సీఎంకు చెప్పుకొన్నారు. వాటిని పరిష్కరించాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీఎం సూచించారు. అనంతరం ఇడుపులపాయ చర్చి ఆడిటోరియంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులు, పార్టీ ముఖ్యనాయకులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు సమీక్ష కొనసాగనుంది.

జగన్ నివాళులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.