Badvel By Poll: బద్వేలు బరిలో 15 మంది.. అభ్యర్థుల చరిత్ర ఇదే

author img

By

Published : Oct 14, 2021, 2:51 PM IST

Badvel By Poll

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెదేపాతో పాటు జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో.. వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఖరారైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల చరిత్రను ఓసారి పరిశీలిస్తే...

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ మంది అభ్యర్థులు తుది పోటీలో ఉంటారని చాలామంది భావించారు. అయితే.. అందుకు విరుద్ధంగా గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతమే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం.

ఇతర నియోజకవర్గాల్లో నివాసం..
బద్వేలు ఉపఎన్నిక అభ్యర్థుల్లో ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో నివసిస్తున్నవారు ఏడుగురు ఉన్నారు. వైకాపా అభ్యర్థి దాసరి సుధ కడప నగరంలోని క్రిస్టియన్‌ లేన్‌లో.. భాజపా అభ్యర్థి పనతల సురేష్‌ రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు హరిజనవాడలో నివసిస్తున్నారు. ఈ జాబితాలో గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన నవతరం పార్టీ అభ్యర్థి రమేష్‌కుమార్, కర్నూలు జిల్లా పగిడ్యాల మండలానికి చెందిన ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి నాగరాజు, కడప నగరానికి చెందిన మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి మనోహర్, స్వతంత్ర అభ్యర్థులు రాజేష్, హరిప్రసాద్‌ ఉన్నారు.

త్రిముఖ పోరు ఖరారు..
బద్వేలు ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖరారైంది. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొంటారని వచ్చిన ఊహాగానాలకు తెర పడింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపాతోపాటు జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఉప ఎన్నికల్లో వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. మరికొన్ని చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారు. నామినేషన్‌ ప్రక్రియలో చివరి ఘట్టమైన ఉపసంహరణ బుధవారం ముగియడంతో తుది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఉపసంహరించుకున్నారు. వీరిలో.. పోరుమామిళ్ల మండలానికి చెందిన జి.విజయకాంత్, సి.బ్రహ్మయ్య, బద్వేలు పట్టణానికి చెందిన పసుపుల బాలకృష్ణ ఉన్నారు.

నిరక్షరాస్యులు ఒక్కరే..
మొత్తం అభ్యర్థుల్లో నిరక్షరాస్యుడిగా మనపార్టీ అభ్యర్థి శీలి పెద్ద చెన్నయ్య మాత్రమే ఉన్నారు. విద్యార్హతలవారీగా పరిశీలిస్తే పదో తరగతిలోపు ముగ్గురు, ఇంటర్మీడియట్‌ ఇద్దరు, డిగ్రీ అయిదుగురు, పీజీ చదినవారు నలుగురు ఉన్నారు.

అభ్యర్థుల వయసు ఇలా..
ఉపఎన్నిక బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల్లో 41-50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 30-40 ఏళ్ల మధ్య అయిదుగురు, 41-50 ఏళ్ల మధ్య ఆరుగురు, 51-60 ఏళ్ల మధ్య ఇద్దరు, 60-65 ఏళ్ల మధ్య ఇద్దరు ఉన్నారు. అత్యధికంగా 65 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి సింగమల వెంకటేశ్వర్లు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి జె.రాజేష్‌ (33) అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.