పింగళి వెంకయ్య జీవితం ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి వెంకయ్య

author img

By

Published : Aug 3, 2022, 6:15 PM IST

పింగళి వెంకయ్య జీవితం ఆదర్శనీయం

Pingali Venkayya: భారత ప్రజల విజయధ్వజమైన జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు ప్రజలకు గర్వ కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనదన్నారు. తిరంగా ఉత్సవ్‌లో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న పింగళి వెంకయ్య కుటుంబీకులను ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వేర్వేరుగా సత్కరించారు.

Pingali Venkayya Family Meets Vice President: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖల మంత్రి కిషన్‌రెడ్డిలు వేర్వేరుగా సన్మానించారు. తిరంగా ఉత్సవ్‌లో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న పింగళి వెంకయ్య కుటుంబీకులను.. ఉపరాష్ట్రపతి తన నివాసంలో సన్మానించారు. భారత ప్రజల విజయధ్వజమైన జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు ప్రజలకు గర్వ కారణమని కొనియాడారు.

భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనది. పింగళి కార్యదీక్ష, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి -వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

Kishan Reddy: జాతీయ పతాక రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన కృషి అసమానమైనదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నివాస, వ్యాపార సముదాయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం ద్వారా పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారన్నారు.

పింగళి వెంకయ్య చిత్రపటాన్ని కిషన్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులకు బహూకరించారు. ఇంతకాలం తర్వాతైనా తమను గుర్తించినందుకు ఆనందంగా ఉందని, ఇన్ని సంవత్సరాల పాటు తమవైపు చూసిన వారే లేకుండా పోయారని పింగళి వెంకయ్య కుటుంబీకులు జీవీఎన్ నరసింహం, గోపికృష్ణ, మనవరాలు పింగళి సుశీల, ముని మనవళ్లు పింగళి వెంకయ్య దశరథరామ్, జీకె ప్రవీణ్ అన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.