Telangana Liberation Day 2022 : బందూకులెత్తారు.. బరి గీశారు..

author img

By

Published : Sep 17, 2022, 9:52 AM IST

liberation

Telangana Liberation Day 2022 : విధ్వంసంకాండతో నరమేధం సృష్టించిన రజాకార్ల ఆకృత్యాలకు ఎదురొడ్డి వారు పోరాటం చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి దొరల గడీల నుంచి సామాన్యులకు విముక్తి కల్పించారు. రజాకార్ల దాష్టీకంతో తమ తోటి వారు ప్రాణాలు కోల్పోయినా కాస్త కూడా జంకకుండా రణభూమిలో రంకెలేస్తూ రజాకార్లను పరిగెట్టించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి నేటికి 75 ఏళ్లు. ఈ వ్రజోత్సవ సంబురాల వేళ నిజాంను ఎదురించి నిలిచిన యోధుల జ్ఞాపకాల గురించి తెలుసుకుందాం.

Telangana Liberation Day 2022 : నైజాం సైన్యం గుర్రపు నాడాల శబ్దం వినిపిస్తే ప్రజలను రహస్య ప్రాంతాలకు తరలించిన వ్యూహం వారిది. విధ్వంసకాండతో నరమేధం సృష్టించిన రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో బందూకులెత్తి బరిగీసిన తెగువ వారి సొంతం. వెట్టిచాకిరి.. హింసలకు ప్రతిరూపమైన దేశ్‌ముఖ్‌, దొరల గడీల నుంచి విముక్తి కల్పించిన వారి సాహసం చిరస్మరణీయం. అడవుల్లో తలదాచుకుని ఆకులూ అలములూ తిని ప్రజల కోసం ప్రాణాలను కాపాడుకున్నారు. భూస్వాములు, జాగీర్దార్ల నుంచి భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టారు.

Telangana Liberation Day Diamond Jubilee 2022 : దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని గ్రామ గ్రామాన చాటారు. ఉర్దూ పదం తప్ప తెలుగుకు చోటులేని నైజాం రాజ్యంలో ఆంధ్రమహాసభలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. భూమి కోసం.. భుక్తి కోసం.. చేసిన పోరాటం ఫలితంగా పేదలకు భూములు దక్కాయి. ఇదే దేశ వ్యాప్తంగా భూ సంస్కరణలకు దారిచూపింది. 1946లో తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య నిలవగా చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్‌, షోయబుల్లాఖాన్‌ లాంటి ఎందరో వీరులు తమ పోరాటాలతో స్ఫూర్తి రగిలించారు.

దాదాపు నాలుగువేల మంది సాయుధపోరులో అసువులు బాసినా కాగడాల్లా నిలిచి ఎదురొడ్డి పోరాడారు. రజాకార్ల దాష్టీకంతో భైౖరాన్‌పల్లిలో 118 మంది ప్రాణాలు కోల్పోయినా వెన్ను చూపలేదు. చివరికి భారత ప్రభుత్వ జోక్యంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ రాజ్యానికి తెర పడింది. భారత్‌లో అంతర్భాగమైంది. అందుకే సెప్టెంబరు17కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు.. మూడేళ్లపాటు రాష్ట్రంలో యూనియన్‌ సైన్యాలు శాంతిభద్రతలను పర్యవేక్షించగా వారిని అడ్డుపెట్టుకుని గ్రామాల్లో దొరలు భూములను వెనక్కు లాగేసుకున్నారు. ఈ సందర్భంగా వారి దమనకాండపై మరో పోరాటం చేశారు.

నాపై 16 కేసులు

-జైని మల్లయ్య గుప్తా(97)

‘‘మాది భువనగిరి ప్రాంతం. నా పేరు మల్లయ్య గుప్తా(97) అక్కడి మండిలో చిన్న వ్యాపారం చేసేవాడిని. 1942 సమయంలో నిజాం పాలనలో జులుం మొదలైంది. ఆ దారుణాలపై పోరాడేందుకు నా స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడ్డాం. మండీలోని చిరువ్యాపారుల సహకారంతో జనంలో చైతన్యం తీసుకొచ్చేలా సమావేశాలు నిర్వహించాం. పూర్తి వివరాలు చెప్పిన పదిహేను రోజులకు గాని సభ నిర్వహణకు నిజాం నుంచి అనుమతి వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌-భువనగిరిల మధ్య సంచరిస్తూ రాజ్బ్‌హద్దూర్‌గౌడ్‌, బూర్గుల నర్సింగరావు వంటి వారితో కలిసి ఉద్యమాన్ని విస్తృతం చేశాం. ఈ క్రమంలోనే నాపై 16 కేసులు నమోదయ్యాయి. 1946లో నన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ తరలించారు. అక్కడ పది నెలల జైలు జీవితాన్ని గడిపా. ఒకరోజు బయటకు వెళ్లేందుకు అనుమతించారు. నాంపల్లిలోని ఒక టిఫిన్‌ సెంటర్‌లో ఆగి అల్పాహారం తీసుకుంటున్నాం. పాన్‌ తినే సాకుతో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నా. మళ్లీ దొరకలే. రావి నారాయణరెడ్డి, ఆర్య సమాజ్‌ నరేంద్ర వంటి వారి ప్రభావంతో మా పోరాటాన్ని తీవ్రం చేశాం. నిజాం నవాబు ముస్లిం అయినా, తన తీరు నచ్చక అనేక మంది విద్యావంతులైన ముస్లిం యువత నాటి పోరాటంలో పాల్గొన్నారు. మఖ్దూం మోహియుద్దీన్‌, రఫీ అహ్మద్‌ వంటి వారు ఉద్యమాన్ని నడిపారు. నైజాంలో జరుగుతున్న పోరాటాన్ని తెలుసుకోవడానికి కశ్మీర్‌ నుంచి వచ్చిన షేక్‌ అబ్దుల్లాకు ఇక్కడి పరిస్థితుల్ని చెప్పాం. ఉద్యమంలోకి రావడానికి సంశయిస్తున్న పేద ముస్లింలకు విషయం అర్థమయ్యేలా చెప్పమని కోరగా.. ఆయన రెండ్రోజులు అదే పనిలో ఉండి కొంత వరకు సఫలమయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున హైదరాబాద్‌లో జాతీయ పతాకాన్ని తొలుత ఎగురవేసిన వ్యక్తి కూడా రఫీ అహ్మద్‌ అనే ముస్లిం విద్యార్థే’’ అని గుర్తుచేసుకున్నారు మల్లయ్య గుప్తా.

23 నెలలు జైలు శిక్ష అనుభవించా

-గుంటకండ్ల పిచ్చిరెడ్డి(97)

‘‘మాది సూర్యాపేట. తెలుగులో చదువుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఆరో తరగతి వరకు ఉర్దూలోనే చదివా. నిజాం నవాబును ప్రార్థించడంతో తరగతులు ప్రారంభమయ్యేవి. అవన్నీ భరించలేక బడికెళ్లడం ఆపేశా. అనంతర కాలంలో ధర్మభిక్షం విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. గ్రామాల్లో జరిగే అరాచకాలను విన్న నేను సంఘ పోరాటాలకు ఆకర్షితుడినయ్యా. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఏర్పడితే.. అందులో చేరా. విద్యార్థి యూనియన్‌ నడుపుతున్నారని నల్గొండలో గొల్లపల్లి సుగుణారావు, సీహెచ్‌ హన్మంతరావు, మిట్టా యాదవ్‌రెడ్డిలను నిజాం సైన్యం అరెస్టు చేసింది. దీంతో మా జట్టంతా రహస్యంగా కార్యకలాపాలు సాగించింది. స్థానికంగా ఉండే దేశ్‌ముఖ్‌లు వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఎకరాలకు ఎకరాలు పండించుకునేవారు. ప్రజలకు పైసలు, పంటలేవీ ఇవ్వకపోయేవారు. 12 ఏళ్లు సాగు చేస్తే ఆ భూమిని సాగుదారుడికి ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. అమలు చేసేవారు కాదు. దాని పైనా రైతులను కూడగట్టి పోరాటంచేశా. జనగామ తాలూకాలో ఒక దేశ్‌ముఖ్‌ పరిధిలో అరవై ఊర్లు ఉండగా.. సుంకం వసూలు చేసి సర్కారుకు పంపేవాడు. ఊరి చుట్టూ ఉండే మాగాణి భూముల్లో పంటనంతా దౌర్జన్యంగా తీసుకునేవాడు. ఆయనపై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాడి భూములను పేదలకు పంచాం. నేను గ్రెనేడ్‌తో పట్టుబడి 23 నెలలు కారాగార శిక్ష అనుభవించా. సాయుధ పోరాటంలో అడవుల్లోనే ఉన్నాం.కేంద్ర సైన్యాలకు నిజాం లొంగిపోయినప్పటికీ మేం పోరాటం ఆపలేదు. మేం పేదలకు పంచి ఇచ్చిన భూములను సైన్యం సహకారంతో.. మళ్లీ దొరలు తెల్లటోపీలు పెట్టుకుని గ్రామాలకు వచ్చి ఆక్రమించారు. వాటిని అడ్డుకున్న కమ్యూనిస్టు దళాలను కాల్చి చంపారు. అయినప్పటికీ సుదీర్ఘకాలం పోరాటం చేసి.. జనజీవన స్రవంతిలో కలిశా’’ అని నాటి సంఘటనలను చెప్పారు పిచ్చిరెడ్డి.

దొరపై పోరాటంలో బందూకు పట్టాను

-దర్గ్యానాయక్‌(105), ధర్మాపురం

రజాకార్లతో పోరాడిన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం పడమటి తండాకు చెందిన జాటోతు దర్గ్యానాయక్‌(105) ప్రస్తుతం మంచాన పడి అచేతన స్థితిలో ఉన్నారు. మూడునెలల కిందట ఆయన ‘న్యూస్‌టుడే‘తో మాట్లాడుతూ పోరాట ఘట్టాలు వివరించారు. వారి ఉమ్మడి కుటుంబ సభ్యుడైన జాటోతు ఠానూనాయక్‌ చూపిన తెగువ మరిచిపోలేనిదని గుర్తు చేసుకున్నారు.

‘‘ఆరుగాలం పండించిన ధాన్యాన్ని విసునూరు దొర అప్పనంగా తీసుకెళ్తుంటే.. దొరమీద తిరగబడితే ఏమవుతుందని ప్రశ్నించిన ధీశాలి ధర్మాపురం జాటోతు తండాకు చెందిన ఠానూనాయక్‌. ప్రశ్నించడమే కాకుండా తను పండించిన ధాన్యాన్ని దొర మనుషులు తీసుకెళ్తుంటే.. ఎదురుతిరిగి ధాన్యాన్ని తెచ్చుకున్నాడు. దీంతో దొర మనుషులు ఠానూనాయక్‌ కోసం వెతికారు. అతను దొరక్కపోవడంతో కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేశారు. దొర మనుషుల అరాచకాలతో తండావాసుల హృదయాలు రగిలిపోయాయి. వారిలోనూ తిరుగుబాటు భావనలు పెరిగాయి. అత్యధికులు ఠానూనాయక్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో జరుగుతున్న పోరాటంలో కొంతకాలానికి మొండ్రాయిలో ఉన్న ఠానూనాయక్‌కు పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి, దొరమనుషులు కాల్చి చంపారు. అనంతరం అతని కుటుంబసభ్యులను సజీవ దహనం చేశారు.నిజాం పాలన నుంచి స్వేచ్ఛ లభించాక ధర్మాపురం ప్రాథమిక పాఠశాల సమీపంలో ఠానూనాయక్‌ స్మారక స్తూపం కట్టించారు’’ అని దర్గ్యానాయక్‌ వివరించారు. ‘‘నేనూ ఠానూనాయక్‌కు అనుంగు అనుచరుడిగా మెలిగా. దొరకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొన్నా. బందూకు పట్టాను.ఏ మార్గంలో వెళ్తే సులువుగా తప్పించుకోవచ్చు అనే ఆనుపానులన్నీ నాకు తెలిసి ఉండడంతో.. ఠానూనాయక్‌ దళంలో ముఖ్యునిగా కొనసాగా’’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు దర్గ్యా నాయక్‌.

చిన్నప్పుడే రహస్యంగా సమాచారం చేరవేశా..

-బత్తిని యాదగిరిగౌడ్‌(89)

‘‘మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం. దొర వద్ద జీతానికి ఉండేవాడిని. నెలకు 10 శేర్ల ధాన్యం కూలిగా ఇచ్చేవాడు. సుమారు 13 ఏళ్ల వయసులో దొర గొర్లు, మేకలను మేపడానికి గ్రామ శివారులోని దట్టమైన ఈత వనంలోకి వెళ్లేవాడిని. ఓ రోజు అక్కడ ముగ్గురు కూర్చుని ఏదో చర్చించుకుంటున్నారు. నా వివరాలు అడిగారు. నా వద్ద ఉన్న గట్క, గంజి వారికి పెట్టాను.‘రెండు, మూడ్రోజుల ఇక్కడే ఉంటాం.. రోజూ కొంత గట్కను రహస్యంగా తీసుకురావాలి’అని కోరారు. గ్రామంలో చదువుకున్న యువకుల వివరాలడిగితే కొప్పుల నర్సిరెడ్డి, బండారి బుచ్చిరెడ్డి, జీడిమల్ల రాంచద్రారెడ్డి పేర్లు చెప్పా. ఓ ఉత్తరం ఇచ్చి వారికి ఇమ్మని చెప్పి.. ‘వారం రోజుల తర్వాత వస్తాం.. వారిని పరిచయం చేయించాలి’అని వెళ్లి పోయారు. వారం తర్వాత పరిచయం చేశా. అప్పటికీ ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాతే తెలిసింది వారు ‘రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బద్దం ఎల్లారెడ్డి’ అని. మరో పది రోజుల తర్వాత వచ్చినప్పుడు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమాన్ని వివరించారు.గుండాల మండలం సుద్దాలలో గుర్రం యాదగిరిరెడ్డి, ఆత్మకూరు మండలం కప్రాయిపల్లిలోని దూదిపాల పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, కూరెళ్లలో కంచర్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాయుధ దళాల మధ్య సమాచారం చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషించేవాడిని. రావి నారాయణరెడ్డి సూచనతో రజాకార్ల దాడుల నుంచి తప్పించుకునేందుకు విజయవాడకు వెళ్లాను. నెల తర్వాత తిరిగొచ్చా. హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఓ ముసలావిడ వద్ద బర్లు(గేదెలు) కాస్తూ తలదాచుకున్నా. మోత్కూరులో అమీను(పోలీసు), రజాకార్లతో జరిగిన పోరాటంలోపాల్గొన్నా. భువనగిరిలో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు వందల మందిని తరలించా’’ అని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు యాదగిరిగౌడ్‌.

రజాకార్ల ఊచకోతలు కళ్లారా చూశా

- అడేవారు లింగుబాయి(107)

‘‘ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒకసారి నా కళ్ల ముందే దారుణం జరిగింది. రక్తపు మడుగులోంచి బయటకు వచ్చా. ఆ క్షణాల్లో నా ప్రాణాలు నిలబడతాయనే నమ్మకం లేకుండె. ఒకసారి మా పుట్టింటికి వెళ్లి తిరిగి కాలినడకన మర్లపెల్లి వస్తున్నా. అప్పుడు నా వెంట కుటుంబ సభ్యులూ లేరు. మార్గమధ్యలో భైంసా సమీపంలో రజాకార్లు కొంత మందిని చంపేశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా ఊచకోత కోశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగోలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేసి ముందుకు సాగా. భయంతో గుబురు పొదల్లో దాక్కుని అక్కడి నుంచి మెల్లగా దూరంగా వెళ్లిపోయా. ఊపిరి బిగపట్టుకొని ఇంటికి చేరుకున్నా. ఆ తర్వాత కూడా రజాకార్ల ఆగడాలు మా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగాయి’’ అని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు అడేవారు లింగుబాయి. నిర్మల్‌ జిల్లా కుభీర్‌కు చెందిన ఈమెకు బోథ్‌ మండలంలోని మర్లపెల్లి గ్రామానికి చెందిన బాపురావుతో వివాహం జరిగింది. ఆమె 15 మంది సంతానంలో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వారిలో ఆరుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి ప్రస్తుతం 126 మంది ఉన్నారు. 30 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త మృతి చెందారు. ఇప్పటి వరకు మాంసాహారం ముట్టలేదని.. కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తింటారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. వందేళ్లు దాటినా కూడా వంటతో సహా తన పనులన్నీ స్వయంగా చేసుకుంటున్నారని.. జొన్న రొట్టె, మక్క గట్కా అంటే లింగుబాయికి ఇష్టమని వారు పేర్కొన్నారు.

రజాకార్ల ఆగడాలకు అంతే లేకుండె..

-గోపగోని రామలింగయ్య(85)

సూర్యాపేట తాలూకాలోని వర్ధమానుకోటకు చెందిన సయ్యద్‌ మక్బూల్‌(సైదిమోల్‌) బతుకుదెరువు కోసం తన అక్క గ్రామమైన గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. తర్వాత అతను నిజాంకు ప్రతినిధిగా ఉన్న ఖాసింరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల బృందంలో చేరాడు. మా ఊరు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై దోపిడీలు, దౌర్జన్యాలు మొదలు పెట్టాడు. గుండ్రాంపల్లిలో తనకంటూ ఒక బురుజును ఏర్పాటు చేసుకున్నాడు. సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలో నా వయసు 8 ఏళ్లు. ఇష్టారీతిలో పన్నులు వసూలు చేయడం, కోతకు వచ్చిన పంట కోసుకుపోవడం, ధాన్యం, మేకలు, గొర్రెలు బలవంతంగా గుంజుకుపోవడం వంటివి చేసేవాడని మావాళ్లు చెప్పేవారు. నమస్తే పెట్టకున్నా, చెప్పులు వేసుకున్నా చిన్నపిల్లల్ని కూడా కొట్టేవాడు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడు. తన అరాచకాలను తట్టుకోలేక ఎంతో మంది ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పారిపోయారు. తర్వాత కాలంలో ఆయనకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి, పలివెల, వెలిమినేడు, రెడ్డిబావి, గుండ్లబావి, చిన్నకాపర్తి, ఎలికట్ట, పెద్దకాపర్తి గ్రామాలకు చెందిన కొంతమంది యువకులు కమ్యూనిస్టు దళాలుగా ఏర్పడి.. మక్బూల్‌ ఇంటిపై దాడి చేశారు. తను తప్పించుకోగా అతని భార్య, కూతురు చనిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన మక్బూల్‌.. సుమారు ముప్పై మంది యువకులను ఎడ్ల బండికి కట్టేసి మసీదు పక్కనే ఉన్న బావిలో పడేశాడు. కట్టెలు, దూలాలు వేసి సజీవదహనం చేశాడు. ఇలా దాదాపు 300 మంది మరణాలకు కారణమయ్యాడు. పలివెలకు చెందిన కొండవీటి గుర్నాథరెడ్డి, వెలిమినేడుకు చెందిన తోట అంజయ్య ఇంకా కొంత మంది కమ్యూనిస్టులు దళాలుగా ఏర్పడి తనపై దాడి చేయడంతో గాయాలతో తప్పించుకొని హైదరాబాద్‌కు పారిపోయాడు. మక్బూల్‌ కుటుంబాన్ని, వారికి సహకరించిన అనుచరులను దళ సభ్యులు చంపేశారు’’ అని అప్పటి అరాచకాలను గుర్తు చేసుకున్నారు రామలింగయ్య.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.