"మునుగోడు"పై మూకుమ్మడిగా.. ప్రధాన పార్టీల దృష్టి

author img

By

Published : Aug 4, 2022, 10:23 AM IST

munugodu by poll

munugodu constituency : కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో.. ప్రధాన పార్టీలు కార్యాచరణను వేగవంతం చేశాయి. మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో క్షేత్రస్థాయిలో తెరాస, కాంగ్రెస్‌లు తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి. కార్యకర్తలను కలుస్తున్నరాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నికకు దారితీసిన కారణాలను వివరిస్తున్నారు.

munugodu constituency : రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యంగా మారడంతో.. ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టిపెట్టాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసే పనిలోపడ్డాయి. శుక్రవారం జరిగే మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించి వ్యూహ, ప్రచార కమిటీ సభ్యులు పర్యటించనున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుగౌడ్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సభ్యులు సీతక్క, బలరాం నాయక్‌ తదితరులు మండలాల్లో శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. శంకర్‌నాయక్‌ బుధవారం చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు.

ఆశావహుల విశ్వప్రయత్నాలు.. మునుగోడు స్థానాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో.. అధికార తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కొంత కాలం నుంచే సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మునుగోడుపై మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మండలాల వారీగా తెరాస ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించగా.. తాజాగా మరో సర్వే సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది. టికెట్‌ కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్​ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది.

బీసీలకే టికెట్.. నియోజకవర్గంలో గెలుపోటముల్లో నిర్ణయాత్మకంగా ఉన్న బీసీలకే ఈసారి టికెట్‌ ఇవ్వాలని పలువురు టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి పార్టీ పెద్దలకు తమ అనుకూలతలను వివరిస్తున్నారు. కాంగ్రెస్‌లో పని చేసిన అనుభవంతోపాటూ తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తానని సుంకరి మల్లేష్‌ గౌడ్ చెబుతున్నారు. ఆసరా ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్న నారాయణపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లం శివ తదితరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మద్దతు కావాలి.. పార్టీ మార్పుపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన రాజగోపాల్‌రెడ్డి భాజపాలో తనతో కలిసి సాగాలని మండలాల వారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. చండూరు, నాంపల్లి మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన.. కేసీఆర్​తో ధర్మయుద్ధం చేస్తున్నానని, అందుకు తనకు మద్దతివ్వాలని కోరారు. రానున్న కాలంలో మండలాల వారీగా ప్రజలను కలిసి తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో.. ఉప ఎన్నికకు కారణమేంటో చెబుతూ జనంలోకి వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.