అమ్మఒడి షాక్‌.. 1.29 లక్షల మందికి కోత.. పెండింగ్​లో మరో లక్షన్నర..

author img

By

Published : Jun 23, 2022, 5:23 AM IST

Amma vOdi shock

అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో భారీగా కోత విధించింది ప్రభుత్వం. 1.29 లక్షల మందికి కోత విధించగా.. మరో లక్షన్నర మంది తల్లుల ఈకేవైసీ పెండింగ్​లో ఉంది. నిర్వహణ పేరుతో రూ.2వేల కోత విధించి.. ఖాతాల్లో రూ.13 వేల జమ చేస్తున్నారు.

అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనుంది. 2021 జనవరి 11న 44,48,865 మంది బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేయగా.. ఈ ఏడాది 43,19,090 మందిని అర్హులుగా తేల్చింది. వీరిలో 1,46,572 మందికి ఈ-కేవైసీ పూర్తికాలేదు. విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లు దాటినా.. విద్యార్థికి 75% హాజరు లేకపోయినా అమ్మ ఒడికి అర్హత కోల్పోతారు. కొత్త బియ్యం కార్డు ఉండడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం లాంటివి పూర్తి చేయకపోయినా ప్రయోజనం అందదని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈ నెల 27న తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020, 2021లో విద్యార్థులకు 75% హాజరు నిబంధనను అమలు చేయలేదు. దీంతో మొదటి ఏడాది 43 లక్షలు, రెండో ఏడాది 44.48 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా తేలారు. తాజాగా నిబంధనలను విధించడంతో కోత పడింది.
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచినా కరోనా మూడోదశ రావడంతో కొన్నిచోట్ల తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపలేదు. దీంతో చాలామందికి 75% హాజరు పడలేదు.

అనర్హుల జాబితా ఎక్కడ?: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. వారు ఎందుకు అనర్హులయ్యారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించలేదు. దీంతో జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించినా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలు బాధ్యతను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించి గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి అప్పగించారు.

నిర్వహణ పేరుతో కోత: అమ్మఒడి సాయంలో ఈ ఏడాది అందరికీ రూ.2వేలు కోత పడనుంది. 2020లో మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛందంగా రూ.వెయ్యి ఇవ్వాలని తల్లిదండ్రులను అధికారులు కోరారు. కొందరు రూ.వెయ్యి ఇవ్వగా.. మరికొందరు ఇవ్వలేదు. దీంతో 2021లో ఖాతాలకు జమ చేసే సమయంలోనే రూ.వెయ్యి మినహాయించారు. ఈ ఏడాది మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ కోసమని రూ.2 వేలు మినహాయించనున్నారు. ప్రైవేటు బడుల్లో చదివే వారికి ఇలా మినహాయించగా వచ్చే సొమ్మునూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కేటాయించనున్నారు. దీన్ని ప్రైవేటులో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు.

అర్హత కోల్పోయినవారి వివరాలను నవశకం లబ్ధిదారుల నిర్వహణ పోర్టల్‌లో నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. గతేడాది లబ్ధి పొందినవారు ఈసారి ఎందుకు అర్హత కోల్పోతారు? అనర్హుల జాబితాను ఒకేసారి ఎందుకు సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు? తమకు ఎందుకు అందడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తేనే పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. జాబితాల ప్రకటనలో ఎందుకంత రహస్యమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: సీఎం జగన్ పారిస్‌ పర్యటనకు.. సీబీఐ కోర్టు పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.