Pills off debt: శాసనసభ పర్యవేక్షణ పాత్ర నిర్వీర్యమయ్యే ప్రమాదం.. కాగ్

author img

By

Published : Sep 22, 2022, 9:56 AM IST

Pills off debt

A state in debt: రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 31 నాటికి వివిధ సంస్థలకు లక్షా 19 వేల 230 కోట్లకు పూచీకత్తులు ఇచ్చిందన్న కాగ్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు 25వేల కోట్లకు ఇచ్చినట్లు తెలిపింది. ఆ వివరాలను బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించలేదని కాగ్‌ పేర్కొంది. అప్పట్లో ‘ఈనాడు’ ఇదే అంశంపై కథనం రాయగా ఆర్థికమంత్రి బుగ్గన ఖండించారు. ఏపీఎస్‌డీసీ రుణానికి గ్యారంటీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు కాగ్‌ ఆ గ్యారంటీలను బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించలేదని పేర్కొంది. ఈ పూచీకత్తు కలిపితే 2021 మార్చి 31 నాటికి మొత్తం పూచీకత్తులు లక్షా 44 వేల 230 కోట్లు అయ్యాయి.

Pills off debt! : ఏడాదిలో 331 రోజులు అప్పులతోనే రాష్ట్రం: రాష్ట్రానికి రోజూ రిజర్వుబ్యాంకు వద్ద కోటి 94 లక్షల నగదు నిల్వ ఉండాలి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 34 రోజులే ఇలా ఉండగా.. మిగిలిన అన్ని రోజులూ రిజర్వుబ్యాంకు నుంచి చేబదులు తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏడాదిలో 331 రోజులు అప్పులతోనే రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ప్రభుత్వం నడిపించిందని కాగ్‌ తేల్చిచెప్పింది. అలాగే బడ్జెట్‌లో చూపని రుణాలతో ప్రమాదమేనని హెచ్చరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వివరణ అసంబద్ధమని కాగ్‌ స్పష్టం చేసింది.

ఏడాదిలో 331 రోజులు అప్పులతోనే రాష్ట్రం


చేబదుళ్ల రూపంలో తీసుకున్నవి మొత్తం లక్షా 4 వేల 539.24 కోట్లు

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎలా ఉందో కాగ్‌ స్పష్టంగా తేల్చిచెప్పిం ది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల రూపంలో తీసుకున్న మొత్తం లక్షా 4 వేల 539.24 కోట్లుగా తేల్చింది. ఆ మొత్తం తీర్చేందుకు రాష్ట్రప్రభుత్వం 83.05కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చిందనీ కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన నగదు నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించింది. వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ప్రత్యేక డ్రాయింగు సదుపాయం, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వెసులుబాటును ఉపయోగించుకోకుండా నగదు నిర్వహణను మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వానికి కాగ్‌ సూచించింది.


6 వేల 278.59 కోట్ల రూపాయలతో స్థలాల పంపిణీకి చర్యలు

ఏపీలో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నారని.. వాటినుంచి ఎలాంటి ఆదాయం రాదని కాగ్‌ పేర్కొంది. అదే ఖర్చును మూలధన వ్యయంగా.. అంటే ఆస్తుల సృష్టికి చేసేదిగా పేర్కొంటున్నారని కాగ్‌ తప్పుబట్టింది. ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 మధ్య రూ.61వేల కోట్ల అంచనాతో 25 లక్షల పక్కాగృహాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిందన్న కాగ్‌. 6 వేల 278.59 కోట్ల రూపాయలతో స్థలాల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని మూలధన వ్యయం కింద ప్రభుత్వం చూపించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కాకుండా లబ్ధిదారుడి పేరు మీద ఆ స్థలాలు రిజిస్టర్‌ చేసినందున ఈ ఖర్చును రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలని కాగ్‌ పేర్కొంది. దీనిపై ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ అభిప్రాయంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగానే ఉండిపోయిందని కాగ్‌ పేర్కొంది.

''సాగునీటి ప్రాజెక్టుల వల్ల సమకూరే ప్రయోజనాలు వాటి ఖర్చుకంటే ఎక్కువ'' కాగ్
మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం, సామాజిక సేవలపై ఖర్చుల నిష్పత్తి ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నట్లు కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఆర్థికరంగం, సేవల రంగం, ఖర్చుల నిష్పత్తి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. విద్య, వైద్య రంగాల్లోనూ.. ఆంధ్రప్రదేశ్‌ ఖర్చు ఇతర రాష్ట్రాల సగటు కన్నా తక్కువే అని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల వల్ల సమకూరే ప్రయోజనాలు వాటి ఖర్చుకంటే ఎక్కువేననే అభిప్రాయం ఉంది. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల ఆ పెట్టుబడుల నుంచి ప్రతిఫలాలకు భరోసా లేకుండా పోయిందని కాగ్‌ అభిప్రాయపడింది.

బడ్జెట్‌లో చూపకుండా తీసుకున్న అప్పు
ఆంధ్రప్రదేశ్‌లో 2021 మార్చి 31 నాటికి 86 వేల 259.82 కోట్లు బడ్జెట్‌లో చూపకుండా ప్రభుత్వం అప్పు తీసుకుందని కాగ్‌ తెలిపింది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల ద్వారా ఈ రుణాలు పొందిందని... ఇవీ కలిపితే మొత్తం బకాయిలు 4 లక్షల 34 వేల 506 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వ బకాయిలేనన్న కాగ్‌ ఈ రుణ మొత్తాలను బడ్జెట్‌ పత్రాల్లో చూపట్లేదని స్పష్టం చేసింది. ఈ అప్పులకు శాసనసభ ఆమోదం లేదని కాగ్‌ వెల్లడించింది . ఈ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాలని పేర్కొంది. కార్పొరేషన్ల ద్వారా ఈ అప్పులు తీసుకోవడం వల్ల రాష్ట్ర నికర రుణ గరిష్ఠ పరిమితిలోకి ఇవి చేరట్లేదని కాగ్ వెల్లడించింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం లక్ష్యాల ఉల్లంఘనేన ని స్పష్టం చేసింది.

''శాసనసభ నియంత్రణ దాటిపోయే ప్రమాదం'' కాగ్

ఈ రుణాలు పారదర్శకత, ఇంటర్‌ జనరేషన్‌ ఈక్విటీ అనే రెండు అంశాలపైనా సందేహాలు లేవనెత్తుతాయన్న కాగ్‌... రాష్ట్రప్రభుత్వం అప్పులకు ఈ మార్గాన్ని అనుసరిస్తే శాసనసభకు తెలియకుండానే తక్కువ వ్యవధిలో బకాయిలు పెరిగిపోతాయని కాగ్ అంది. ఇది శాసనసభ పర్యవేక్షణ పాత్రను, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను నిర్వీర్యం చేయడమేనని కాగ్‌ స్పష్టం చేసింది . దీనివల్ల కీలకమైన సామాజిక ,ఆర్థిక పథకాలకు నిధులు, వనరుల మీద శాసనసభ నియంత్రణ దాటిపోయే ప్రమాదం ఉందని.. కాగ్‌ హెచ్చరించింది . ఈ రుణాలపై రాష్ట్రప్రభుత్వాన్ని కాగ్‌ వివరణ కోరగా.. వారి సమాధానం అసంబద్ధంగా ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. బడ్జెట్‌లో చూపని రుణాలపై ప్రశ్నిస్తే వారు ఈ రుణాలకు ఇస్తున్న గ్యారంటీలకు మంత్రుల అనుమతి ఉందని, శాసనసభకు ఆ విషయాలు తెలియజేస్తున్నారని సమాధానం ఇచ్చారని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.