హైదరాబాద్​లో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట

author img

By

Published : Sep 22, 2022, 1:09 PM IST

Updated : Sep 22, 2022, 4:58 PM IST

TENSION AT GYMKHANA

TENSION AT GYMKHANA ఉప్పల్​ వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్​-ఆస్ట్రేలియా T-20 మ్యాచ్​ టికెట్ల కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో సికింద్రాబాద్​లోని​ జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

IND-AUS T-20 : భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్​ వేదికగా.. ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే.. భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్​సీఏ టిక్కెట్లను బ్లాక్​లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్​ఆర్సీలో పిటిషన్​ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్​లైన్​లో టికెట్లు ఇస్తామని హెచ్​సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్​ గేట్​ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో ఆన్​లైన్​ పేమెంట్లకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు.

భారత్-ఆసీస్​ మ్యాచ్​ టికెట్ల వ్యవహారం కొంతకాలంగా ప్రహసనంగా మారింది. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాస్​ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కొవిడ్​ పరిస్థితుల వల్ల క్రికెట్​ మ్యాచులు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్​ మ్యాచ్​లు కూడా హైదరాబాద్​లో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్​లో మ్యాచ్​ జరుగుతుండటంతో.. అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సులభ ప్రక్రియలో టిక్కెట్లు ఇవ్వడంలో హెచ్​సీఏ పూర్తిగా విఫలమైంది.

అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో.. తోపులాట జరగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వీఐపీ పాస్​ల కోసం కూడా తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.

టికెట్ల తొక్కిసలాటలో మహిళ మృతి..! పోలీసుల క్లారిటీ: జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టంచేశారు. స్పృహతప్పి పడిపోయినవారు, గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ల విక్రయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని... ఉన్నతాధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇక ఉప్పల్ మ్యాచ్‌పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 22, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.