"జే బ్రాండ్స్‌ పోవాలి.. జగన్ దిగిపోవాలి".. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళల నిరసన

author img

By

Published : Jul 30, 2022, 6:49 PM IST

TDP WOMENS PROTEST

TDP WOMENS PROTEST: మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌...కల్తీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. జే బ్రాండ్స్‌ పోవాలి.. జగన్ దిగిపోవాలి అనే నినాదాలు చేస్తూ వినూత్న నిరసనలు చేశారు.

TDP WOMENS PROTEST: కల్తీ మద్యాన్ని నియంత్రించడమే కాకుండా..సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ తెలుగు మహిళలు రోడ్డెక్కారు. విశాఖలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మద్యపాన నిషేధం పేరుతో బార్ లైసెన్స్ లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మద్యం ధరలు పెంచి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ తెదేపా మహిళల నిరసన

కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటుందంటూ .. కృష్ణా జిల్లా గన్నవరంలో జాతీయ రహదారిపై తెలుగు మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్డుపై బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీ ప్రకారం సీఎం మద్యపాన నిషేధం అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని కర్నూలు తెలుగు మహిళలు హెచ్చరించారు.

నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మద్యం పారబోసి తెలుగు మహిళలు నిరసన తెలిపారు. మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపటం సిగ్గుచేటన్నారు. తిరుపతిలోని గాంధీ కూడలిలో ఉరితాళ్లు, తాలిబోట్లతో మహిళలు ధర్నాకు దిగారు. బూటకపు హామీలతో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.