పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల జమలో ప్రభుత్వ నిర్లక్ష్యం..

author img

By

Published : Oct 3, 2022, 7:32 AM IST

Negligence In Depositing Funds

Negligence In Depositing Funds : పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకి.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను జమ చేయడంలో.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలో మార్పురావడం లేదు. 2021-22 సంవత్సరానికి గానూ రెండో విడతగా.. 948 కోట్ల రూపాయలు జమ అయి 20 నుంచి 30 రోజులైనా.. పంచాయతీలకు కేటాయించలేదు. పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కింద.. ప్రభుత్వం మరోసారి నిధులను మళ్లించిందా అనే అనుమానాలు సర్పంచుల్లో వ్యక్తమవుతున్నాయి.

FUNDS : ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. పంచాయతీల పేరుతో బ్యాంకుల ఖాతాలు తెరిపించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిధులను జమ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులు పంచాయతీలకు కేటాయించాలని అధికారపార్టీకి చెందిన సర్పంచులు పలువురు రోడ్డెక్కుతున్నా.. భిక్షాటనలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల జమలో ప్రభుత్వ నిర్లక్ష్యం

15వ ఆర్థిక సంఘం 2021-22 సంవత్సరానికి రెండో విడతగా ఇటీవల విడుదల చేసిన దాదాపు 948 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అయి నెల రోజులు కావస్తున్నా.. పంచాయతీలకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. ఏ పంచాయతీకి ఎన్ని నిధులు కేటాయించాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆర్థికశాఖకు సమాచారం వెళ్లినా స్పందన లేదు.

ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీల బకాయిల కింద సర్దుబాటు చేసేలా ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరినట్లు.. ఇటీవల తనను కలిసిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన పలువురు సర్పంచులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే ఇప్పటికీ ఉత్తర్వులు రద్దు కాలేదు. పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిల కింద మరోసారి మళ్లించిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు సర్పంచులు అంటున్నారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను గ్రామం పంచాయతీలకు జమ చేయకపోవడంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల మంత్రి నారాయణస్వామి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామ పంచాయతీలకు నిధులు జమ అవుతున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జమ చేయడం లేదో అధికారుల నుంచి నివేదిక కోరతానని ఆయన తెలిపారు.

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. పన్నుల కింద వసూలైన నిధులు సిబ్బంది జీతాలకే చాలా చోట్ల సరిపోవడంలేదు. దీంతో పలు పంచాయతీల్లో పొరుగు సేవల ఉద్యోగులకు సరిగా జీతాలు చెల్లించడం లేదు. అత్యవసర పనులకూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని, కోనసీమ జిల్లాలోనూ పలువురు వైకాపా సర్పంచులే ఆర్థిక సంఘం నిధులను.. పంచాయతీలకే కేటాయించాలని భిక్షాటన చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.