FLOODS EFFECT: రాష్ట్రంలో భారీ వరదలకు కారణలవేనా..? చర్యలేంటి?

author img

By

Published : Nov 23, 2021, 7:43 AM IST

STATE AND CENTRAL GOVERNMENTS NEGLISGENCE ON FLOODS

మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ వరదలు ముంచెత్తుతూ జనజీవనం స్తంభించిపోయేలా చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బాధితులకు తక్షణ సాయం చేస్తేనే... కొంత సాంత్వన చేకూరుతుంది.

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పోటెత్తిన వరదలు- సామాన్య జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. నీట మునిగిన ఇళ్లూ పొలాలు, కన్నీళ్లూ కట్టుబట్టలతో మిగిలిన బాధితులతో ఎక్కడికక్కడ దుర్భర దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. పదుల సంఖ్యలో అభాగ్యులు ప్రాణాలు పోగొట్టుకోగా- జల ఉద్ధృతిలో జాడ తెలియకుండా పోయిన వారెందరో ఇదమిత్థంగా అంతుచిక్కడం లేదు! మూడు వేల కోట్ల రూపాయల మేరకు పంటనష్టం సంభవించినట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. నాలుగు జిల్లాల్లోని 13వందలకు పైగా గ్రామాలు జలప్రళయంలో చిక్కుకున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో విరుచుకుపడిన వరదల ధాటికి తిరుపతి చిగురుటాకులా వణికిపోగా- తిరుమల మెట్లదారి, ఘాట్‌రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేని వానలతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాలూ అతలాకుతలమయ్యాయి. బాధితులకు తక్షణ సాయం అందించడం ఎంత కీలకమో- ఆయా ప్రాంతాలు అంటువ్యాధుల కోరల్లో చిక్కుకోకుండా కాచుకోవడమూ అంతే ప్రధానం.

తిరుపతిలో ప్రమాద తీవ్రత అధికం కావడానికి జలవనరుల ఆక్రమణలూ కారణం కావడమే ఆందోళనకరం! చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల మూలంగానే నిరుడు భాగ్యనగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయని నీతిఆయోగ్‌ నివేదిక తూర్పారబట్టింది. ఆధునికతకు నోచుకోని మురుగునీటి పారుదల వ్యవస్థలతో పాటు ముందస్తు హెచ్చరికల పరంగా లోపాలు సైతం ప్రజావళికి పెనుశాపమవుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేసింది. ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో గడచిన కొన్నేళ్లలో భారీ వరదలెన్నో సంభవించాయి. అభివృద్ధి ముసుగులో పర్యావరణానికి పొగపెడుతున్న మానవ దుశ్చేష్టలే అత్యధిక ఉత్పాతాలకు కారణభూతమవుతున్నాయి. వాటిని నివారించడంతో పాటు ఊహించని విధంగా విరుచుకుపడే విపత్తుల నిర్వహణకు సంబంధించి పటుతర ప్రణాళికల రూపకల్పన, అమలులో ప్రభుత్వాల అలక్ష్యమే భారతావనిని తరచూ శోకసంద్రంలో ముంచేస్తోంది!

దేశవ్యాప్తంగా 1953-2018 మధ్య సంభవించిన వరదల్లో లక్ష మందికి పైగా అసువులుబాయగా- నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. ఆ తరవాతి నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి వెల్లువెత్తిన వైపరీత్యాల్లో దాదాపు ఏడు వేల మంది మరణించగా- సుమారు రెండు కోట్ల హెక్టార్లలో పంటలు నాశనమైనట్లు కేంద్రం ఇటీవల లోక్‌సభాముఖంగా ప్రకటించింది. దేశీయంగా నాలుగు కోట్ల హెక్టార్ల భూభూగానికి వరదల ముప్పు పొంచి ఉందని 1980లోనే హెచ్చరించిన జాతీయ వరదల సంఘం- దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన కీలక చర్యలపై 207 సిఫార్సులు చేసింది.

వరద నియంత్రణ వ్యూహాలకు సంబంధించి ఇటీవల మేలిమి సూచనలు చేసిన పార్లమెంటరీ స్థాయీసంఘం- జాతీయ సమీకృత వరద నిర్వహణ బృందాన్ని (ఎన్‌ఐఎఫ్‌ఎంజీ) కొలువుతీర్చాలని ఉద్ఘాటించింది. వైపరీత్యాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ వ్యయం కోసుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలపై పగపట్టినట్లు పడగెత్తే విపత్తులను సొంతంగా ఎదుర్కోవడం రాష్ట్రాల శక్తికి మించిన పని! సమధిక నిధుల కేటాయింపుతో ఈ బృహత్కార్యంలో కేంద్రమూ కలిసివస్తేనే బాధితులకు సత్వరం సాంత్వన దక్కుతుంది. జలవనరులను కొల్లగొట్టే ప్రణాళికారహిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమూ తీవ్ర అనర్థదాయకం. వాతావరణ మార్పులకు ఆజ్యంపోసే పెడపోకడలను కట్టడి చేయడంతో పాటు నదీగర్భాలను సైతం తొలిచేస్తున్న ఇసుకాసురుల ఆగడాలు వంటివాటిపై ఉక్కుపాదం మోపడం అత్యవసరం. ఆ మేరకు చురుగ్గా వ్యవహరిస్తూ, ఆధునిక వరద హెచ్చరిక వ్యవస్థలను అందిపుచ్చుకొంటూ, పాలకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే- దేశంలో వరద విషాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యపడుతుంది!

ఇదీ చూడండి: CBN Kadapa Tour: ఆ జిల్లాల వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.