ఈ ఏడాది 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు

author img

By

Published : Sep 24, 2022, 7:20 AM IST

Etv Bharat

Government Schools: 2021-22తో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. కరోనా వేళ దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయితే ఇది తమ సంస్కరణల ఫలితమేనంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం చేసుకుంది. కానీ తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించకపోవడంతోనే విద్యార్థులు మళ్లీ ప్రైవేటు బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం తెచ్చిన గందరగోళమూ ఒక కారణం అయ్యింది.

Governments Schools: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రివర్స్‌ గేర్‌లో పడినట్లయింది. తరగతుల విలీన ప్రభావంతోపాటు కరోనా సమయంలో ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా విద్యార్థుల సంఖ్య 3.50 లక్షలు తగ్గింది. విద్యా రంగంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలతోనే విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఇప్పటి వరకు గొప్పగా ప్రకటించుకున్న ప్రభుత్వం ఈసారి పిల్లలు తగ్గడంపై ఏం చెబుతుంది?

‘నాడు- నేడు’ కింద బడులకు రంగులు వేసి, అందంగా ముస్తాబు చేసినంత మాత్రాన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందా? నాడు- నేడు, విద్యా కానుకలతో పిల్లల సంఖ్య పెరిగితే ఏటా ఆ వృద్ధి కనిపించాలి కదా! లేదంటే గతేడాది ఉన్న వారే ఉండాలి కదా? పిల్లలు ఎందుకు తగ్గారు? నాణ్యమైన విద్య ఎక్కడ అందితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడికి పంపించేందుకు ఇష్టపడుతున్నారు.

కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు, దిగువ మధ్యతరగతివారు ప్రైవేటు బడుల్లో ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అసర్‌ సర్వే-2021 ప్రకారం జాతీయ స్థాయి సరాసరి చూస్తే 2018లో 64.3 శాతం మంది ప్రభుత్వ బడుల్లో ఉండగా.. 2021కి 70.3 శాతానికి పెరిగింది.

Students Strength
ప్రభుత్వ పాఠశాలల్లో సంవత్సరాల వారిగా విద్యార్థుల సంఖ్య

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 43.1 శాతం నుంచి 56.3 శాతానికి పెరిగింది. కానీ సంస్కరణలతోనే విద్యార్థులు పెరిగినట్లు ప్రభుత్వం, అధికారులు ప్రచారం చేశారు. అయితే అలా వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే భరోసా కల్పించకలేకపోయారని, అందువల్లే వారు తిరిగి ప్రైవేటు బాట పట్టారని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Cm Jagan
సీఎం జగన్‌

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాం. ప్రభుత్వంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు 37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు. - శాసనసభలో ఈ నెల 20న సీఎం జగన్‌

వాస్తవం: 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,29,356 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 40.74 లక్షలకు తగ్గారు. దీన్ని ప్రస్తావించకుండా గతేడాది సంఖ్యపైనే సీఎం జగన్‌ మాట్లాడారు. విద్యా సంవత్సరం జులై 5న ప్రారంభమైంది. శాసనసభలో సెప్టెంబరు 20న విద్యా రంగంలో ‘నాడు-నేడు’పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆగస్టు 16కే ప్రవేశాలు ముగిశాయి. ప్రభుత్వం మాత్రం కొత్త విద్యార్థుల లెక్కలను విడుదల చేయకుండా జాగ్రత్త పడింది.

Education Minister Sathyanarayana
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూసివేయం. ఎక్కడైనా మూసేసినట్లు ఉంటే చూపించండి. -విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

వాస్తవం: ప్రభుత్వం అధికారికంగా ఒక్క పాఠశాల మూయకపోయినా తరగతుల విలీనంతో వాటికవే మూతపడే పరిస్థితి తీసుకొచ్చింది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడిలోని అరుంధతిపేటలో గతేడాది ఆరుగురు విద్యార్థులు ఉండగా విలీనం తర్వాత ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది. ఆ ఒక్క విద్యార్థినికి ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 96 ప్రాథమిక బడుల్లో అయిదురుగు కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంతో ఇలాంటి బడులు ఇప్పుడు రాష్ట్రంలో కోకొల్లలుగా మిగిలాయి. వీటి పరిస్థితి ఏంటి?

బెడిసికొట్టిన విలీనం
నూతన విద్యా విధానమంటూ ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు.. కొన్నిచోట్ల చిన్న పిల్లలను దూరం పంపించలేక.. తల్లిదండ్రులు వారిని ప్రైవేటు బడుల్లో వేశారు. మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల సంఖ్య అయిదులోపు ఉన్నవే అత్యధికంగా మిగిలాయి. ఈ బడులు కొనసాగుతాయో లేదో అంటూ కొందరు తమ పిల్లల్ని వేరే పాఠశాలలకు పంపించేశారు.

తగ్గితే కొత్త భాష్యం?
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గడంపై ఉన్నతాధికారులు ఇప్పుడు కొత్త భాష్యం చెబుతున్నారు. ఏపీలో జననాల రేటు తగ్గిందని, ఎయిడెడ్‌ బడులు ప్రైవేటు పరం కావడమే కారణమని చెబుతున్నారు. జననాల రేటు తగ్గితే 2022-23 ఏడాదిలోనే ఒక్కసారిగా తగ్గిపోరు కదా? ఎయిడెడ్‌ బడులు ప్రైవేటుగా మారినందున అనుకున్నా వీటిలో తేడా కేవలం 90 వేలే ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.