రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు.. బకాయిలు రూ.800 కోట్లు

author img

By

Published : May 13, 2022, 4:47 AM IST

ఉపాధి హామీ కూలీలు

రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు బకాయిలు పేరుకుపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 3,4 వారాలుగా చెల్లింపులు లేవు. దాదాపు 800 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉంది. ఒక ట్రెండు రోజుల్లో.. బాకాయిల డబ్బు కూలీల ఖాతాల్లో జమవుతుందని.. అధికారులు చెప్తున్నారు.

మండే ఎండలో రెండు పూటలా పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాక ఉపాధి కూలీలు లబోదిబోమంటున్నారు. పలు జిల్లాల్లో 3, 4 వారాలకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా చెల్లింపులు ఆగిపోయాయి. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద గతేడాది నవంబరు నుంచి కూలీలతో రెండు పూటలా పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది వేసవి భత్యం నిలిపినందున 2 నెలలుగా కూలీలకు వచ్చే వేతనాలు తగ్గాయి. గతంలో ఏటా వేసవిలో కూలీలకు వచ్చే వేతనంతోపాటు ఫిబ్రవరిలో 20%, మార్చిలో 25%, ఏప్రిల్‌, మే నెలల్లో 30%, జూన్‌లో 20% చొప్పున వేసవి భృతి అదనంగా చెల్లించేవారు. దీంతో మిగతా సమయంతో పోల్చి చూస్తే వేసవిలో ఎండల కారణంగా తగినంత శ్రమించకపోయినా భృతితో కూలీలకు వేతనం కలిసొచ్చేది. ఈ ఏడాది వేసవిలో రెండు పూటలా శ్రమిస్తున్నా భృతి వర్తించనందున వేతనాలు బాగా తగ్గాయి. గతేడాది కనీస వేతనం సగటున రూ.216.17 వచ్చేది. ప్రస్తుతం రూ.187.63 వస్తోంది. ఉపాధి కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో 3నుంచి 4వారాలైనా చెల్లింపుల్లేవు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వపరంగా జాప్యమవుతున్నట్లు చెబుతున్నారు.

ఒకట్రెండు రోజుల్లో జమ

‘కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు ఒకట్రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కేంద్రంతో సంప్రదింపులు జరిపాక ఏప్రిల్‌ 22 వరకు కూలీల పనులకు సంబంధించి 3, 4 వారాల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేశారు. ఇవి జమయితే మరో 2 వారాల బకాయిలుంటాయి. 15 రోజులకోసారి చెల్లింపులు జరిపేలా కేంద్రానికి విన్నవిస్తున్నాం’ అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.. అవి ఏంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.