గుడ్​న్యూస్​.. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్షలో కటాఫ్‌ మార్కుల తగ్గింపు

author img

By

Published : Oct 3, 2022, 2:23 PM IST

TSLPRB

TSLPRB Latest News: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీలతో సంబంధం లేకుండా 10 శాతం తగ్గిస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకు గానూ ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు పొందితే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది.

TSLPRB Latest News: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు పొందితే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

కేటగిరీలతో సంబంధం లేకుండా 10 శాతం తగ్గింపు: గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు ఓసీలకు 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులకు 30 శాతంగా ఉండేవి. గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్‌గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓసీలకు, బీసీలకు మాత్రమే కటాఫ్‌ మార్కులను తగ్గించి తమకు మాత్రం యథాతథంగా ఉంచారనే ఆందోళన నెలకొంది.

ఈ విషయం శాసనసభలో ప్రస్తావనకు రావడంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకూ మార్కులను తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు మండలి సన్నాహాలు చేసింది. కానీ కటాఫ్‌ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అది వెలువడటంతో ప్రాథమిక రాత పరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.

మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు సమాచారమివ్వాలి: ప్రాథమిక రాతపరీక్ష రాసిన మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆ కోటాతో పాటు వయో పరిమితి సడలింపు లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారాన్ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత ఖాతాలో నమోదు చేయాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు వివరాలు సమర్పించాలన్నారు. పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌, డిశ్చార్జి బుక్‌, సంబంధిత యూనిట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ నుంచి నిరభ్యంతర పత్రంలో ఏదో ఒక ప్రతిని స్కాన్‌ చేయాలని సూచించారు. గడువులోగా ఆ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే వయో పరిమితి సడలింపు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.