Narasimharao: రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి దాటాక 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై నరసింహారావు అనేక పుస్తకాలు రచించారు.
అప్పటి నుంచే ప్రశ్నించేతత్వం: నరసింహారావు స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు. గ్రామంలో కమ్యూనిస్టు భావజాలం ఉండటంతో ఆ ప్రభావం నరసింహారావుపై పడింది. హైస్కూలు వయసులోనే ప్రఖ్యాత రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి పుస్తకాలను ఆయన ఎక్కువగా చదివేవారు. దీంతో నరసింహారావులో ప్రశ్నించేతత్వం అలవడింది. నిరంతర శోధన, జ్ఞానార్జన పట్ల ఆయన ఎక్కువ మక్కువ చూపించేవారు.
ప్రపంచవ్యాప్త ప్రఖ్యాత రచయితల పుస్తకాలనూ నరసింహారావు చదివేవారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోపాటు యువతలో చైతన్యం, స్ఫూర్తి నింపేలా పుస్తకాలు రాశారు. వీటిలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవే దాదాపు 20 వరకు ఉన్నాయి. ‘రేపు’ అనే దేశంలోనే తొలి మనో విజ్ఞానపత్రికకు ఆయనే వ్యవస్థాపకుడు.
సంతాపం: రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాసంపై రాసిన పుస్తకాలతో నరసింహారావు ఎంతో ప్రాచుర్యం పొందారని అన్నారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సమాజానికి ఆయన అందించిన సేవలు మరవలేమన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. నరసింహారావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని... చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్న ఆకాంక్షించారు.
ఇవీ చదవండి :