కక్ష సాధింపుల కోసమే పోలీసులా.. వారి ఇబ్బందులు పట్టవా?: పవన్​కల్యాణ్​

author img

By

Published : Sep 20, 2022, 10:10 PM IST

pawan kalyan

Pawan Kalyan: పోలీసుల సమస్యలపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్పందించారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలు, కక్ష సాధింపులకు వాడుకోవడమే తప్ప... వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీక్లీ ఆఫ్​ ఇస్తామని గొప్పగా చెప్పి... ఆ ఊసే పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వారి సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు.

Pawan Kalyan on Police Issues: రాష్ట్రంలో ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు, కక్ష సాధింపులకు వాడుకోవడం మీద చూపించే శ్రద్ధ.. వారి ఇబ్బందులను తీర్చడం మీద చూపడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ విమర్శించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చామంటూ సీఎం ప్రసంగాల్లో చెప్తున్న మాటలు... వాస్తవంలో అమలు కావడం లేదని మండిపడ్డారు. పోలీసులకు అందాల్సిన టీఏ భత్యాన్ని 14 నెలల నుంచి బకాయి పెట్టారన్నారు. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు సిబ్బంది నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలతో ఆందోళన చెందుతున్నారన్నారు. తమ జీతం నుంచి భద్రత పేరుతో కొంత మొత్తాన్ని మినహాయించుకుని.. వారికి అత్యవసర సమయంలో ఇస్తామని చెప్పి.. దరఖాస్తు చేసుకుంటే పెండింగ్​లో పెడుతున్నారని.. దాంతో వారంతా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.

అసలు పోలీసు భద్రత కోసం జీతాల నుంచి మినహాయించిన మొత్తాలు భద్రంగా ఉన్నాయా? ఆ మొత్తం ఏం చేశారో పాలకులు చెప్పాలని పవన్​కల్యాణ్​ డిమాండ్​ చేశారు. సమస్యల గురించి అడిగిన చిరుద్యోగులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. నంద్యాలలో కానిస్టేబుల్‌ సురేంద్ర హత్య కేసు నిందితుల్లో ఇప్పటికీ ఒకరిని కూడా అరెస్టు చేయలేకపోయారని విమర్శించారు. ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన టిఏలు, సరెండర్ మొత్తాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.