NTR's Daughter: ఎన్టీఆర్ కుమార్తెది ఆత్మహత్యే.. పోస్టుమార్టం నివేదికలో కీలక వివరాలు

author img

By

Published : Aug 5, 2022, 7:57 PM IST

umamaheswari

NTR's daughter death: ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరిది ఆత్మహత్యే అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు ఉస్మానియా వైద్యులు అందించారు. ఉమామహేశ్వరి ఉరివేసుకుని చనిపోయినట్లు శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు.

NTR's daughter post mortem Report: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఉస్మానియా ఫొరెన్సిక్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన ఉమా మహేశ్వరి తన గదిలో మృతిచెంది ఉండడాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఉమా మహేశ్వరి కూమార్తె దీక్షిత నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో గదిలోకి వెళ్లి, భోజన సమయానికి బయటికి రాకపోవడంతో పిలిచామని.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించినట్లు దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఒత్తిడికి గురవడంతో పాటు అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి బాధపడుతున్నట్లు దీక్షిత పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు తేల్చారు. ముందుగా ఉమా మహేశ్వరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.