NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

author img

By

Published : Dec 2, 2021, 5:48 PM IST

Updated : Dec 3, 2021, 5:20 AM IST

పోలవరంలో ఉల్లంఘనలు

17:45 December 02

రాష్ట్రానికి రూ.243 కోట్ల జరిమానా

రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడం, పర్యావరణానికి వాటిల్లే నష్టాలపై అధ్యయనం చేయకుండానే పనులు చేయడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కొరడా ఝుళిపించింది. పోలవరం (ఇందిరాసాగర్‌), మూడు ఎత్తిపోతల పథకాలకు కలిపి రూ.243.16 కోట్ల జరిమానా విధించింది. జరిమానాను రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లోపు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి (ఏపీ పీసీబీ) చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పోలవరం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పెంటపాటి పుల్లారావు, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల నిర్మాణాలు చేపడుతున్నారని జమ్ముల చౌదరయ్య, మడిశర్ల సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌ తదితరులు వేర్వేరుగా 2017 నుంచి ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. వీటిని ఉమ్మడిగా విచారించిన ఎన్జీటీ.. పిటిషన్లలోని వాస్తవాల నిర్ధారణకు నిపుణుల కమిటీలను నియమించింది. ఆ కమిటీలు అనుమతులు తీసుకోకపోవడం, పర్యావరణ ఉల్లంఘనలు నిజమేనని నిర్ధారించాయి. ఆయా నివేదికల ఆధారంగా ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌, సభ్యులు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, జస్టిస్‌ బ్రిజేష్‌ సేథి, విషయ నిపుణుడు నగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాలపై పలుమార్లు విచారణ జరిపింది. ధర్మాసనం గురువారం తుది విచారణ జరిపి 426 పేజీల తీర్పును వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి...

ప్రాజెక్టుల వారీగా జరిమానా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.120.075 కోట్లు పర్యావరణ పరిహారం కింద చెల్లించాలి. (ప్రాజెక్టు వ్యయం 2010-11 లెక్కల ప్రకారం రూ.16,010 కోట్లు కాగా అందులో 0.75% జరిమానాగా విధించారు.) పోలవరం ప్రాజెక్టు కొనసాగుతుండటంతో పెరిగిన వ్యయం వివరాల్లోకి వెళ్లట్లేదని పేర్కొన్నారు.

* పర్యావరణ అనుమతులు తీసుకోనందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలకురూ.73.65 కోట్ల పరిహారం (ప్రాజెక్టు వ్యయాల్లో 1.5%) చెల్లించాలి. చింతలపూడి ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని, అయితే మూడు నెలల్లో అనుమతులు తీసుకోవాలని షరతు విధించారు. అలా చేయకపోతే తదుపరి పనులు నిలిపివేస్తామని తెలిపారు.

* * పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోకుండా కృష్ణా-గోదావరి-పెన్నా నదుల అనుసంధాన కాలువ (కేజీపీఆర్‌) పనులు చేపట్టొద్దని తీర్పులో స్పష్టంచేశారు.

ఇదీ చదవండి

Local body MLCs in AP: ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్

Last Updated :Dec 3, 2021, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.