MP GVL: అమరావతిలో నిర్మాణాల పురోగతిని పరిశీలించాలన్న రైతుల కోరిక మేరకు... భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వెంకటపాలెం వద్ద రైతులు జీవీఎల్కు స్వాగతం పలికారు. తొలుత మందడంలోని టిడ్కో గృహాలను పరిశీలించిన నరసింహారావు.. లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణాలు పూర్తై మూడేళ్లు గడిచినా... ఇప్పటివరకు తమకు ఇళ్లను స్వాధీనం చేయలేదని లబ్ధిదారులు ఆరోపించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన నిర్మాణాలను ఎంపీ పరిశీలించారు. అనంతరం అమరావతి రైతులతో ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు
చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం కోసమే... వైకాపా ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయంగా విబేధాలు ఉంటే తెదేపాతో తేల్చుకోవాలని.. అమరావతిని మాత్రం బలి పెట్టవద్దని వైకాపాకి సూచించారు. అనంతరం రైతుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. భాజపా అమరావతికి కట్టుబడి ఉందని... రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే... కేంద్ర సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు తరలివస్తాయన్నారు. ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడకుండా.. అభివృద్ధి ప్రణాళిక వెల్లడించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: