khareef: రుతుపవనాలు ఆలస్యం.. ఖరీఫ్ జాప్యం

author img

By

Published : Jun 23, 2022, 7:50 AM IST

monsoons are late in khareef season

Khareef: ఖరీఫ్‌ మొదలై 20 రోజులు గడచినా.. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లోటు వర్షపాతం, రెండు చోట్ల వర్షాభావ పరిస్థితులున్నాయి. సాధారణం కంటే 6 రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు సోమవారానికి రాష్ట్రమంతా విస్తరించాయి. వీటన్నింటి నేపథ్యంలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 1.25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.

Khareef: ఖరీఫ్‌ మొదలై 20 రోజులు గడచినా.. సాగు అంతంత మాత్రమే. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లోటు వర్షపాతం, రెండు చోట్ల వర్షాభావ పరిస్థితులున్నాయి. సాధారణం కంటే 6 రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు సోమవారానికి రాష్ట్రమంతా విస్తరించాయి. వీటన్నింటి నేపథ్యంలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 1.25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పొలాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పత్తి సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాలువలకు నీరొదిలినా.. పలు ప్రాంతాల్లో వరి సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతు భరోసా కేంద్రాలని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రైవేటు విత్తన దుకాణాలపై ఆధారపడక తప్పడం లేదు.

కోస్తాలోనే లోటు వానలు.. రాయలసీమలో ఎక్కువే.. ఖరీఫ్‌ ఆరంభం నుంచి చూస్తే.. కోస్తా జిల్లాల్లోనే వర్షం తక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల్లో గడిచిన నాలుగైదు రోజులుగానే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపాతం అధికంగా నమోదవుతోంది.

  • జూన్‌ 1 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే (-11.6%) నమోదైంది. రాయలసీమలోని వైఎస్సార్‌ జిల్లాలో సాధారణం కంటే అధికంగా 108.7%, శ్రీసత్యసాయిలో 94.9%, అన్నమయ్యలో 69.5%, అనంతపురంలో 62.9% వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 70.5%, శ్రీకాకుళం జిల్లాలో 65.3% చొప్పున సాధారణం కంటే తక్కువ వానలు కురిశాయి.
  • విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షం పడింది. 338 మండలాల్లో లోటు నెలకొనగా.. నాలుగు చోట్ల వానలే లేవు. 128 మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా, 83 చోట్ల అధికంగా, 126 చోట్ల సాధారణంగా వానలు కురిశాయి.
  • కంది సాగు చేసిన రైతులు గతేడాది తెగులుతో నష్టపోయారు. భారీ వర్షాలతో వేరుసెనగ సాగులోనూ నష్టాలే వచ్చాయి. మిరప రైతులు ఎన్నడూ చూడని నష్టాన్ని చవిచూశారు. వీటన్నింటి నేపథ్యంలో పత్తి విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో పంట విరామం.. ఖరీఫ్‌లో 40.75 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, బాపట్ల తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల మాగాణి భూముల్ని కౌలుకు కూడా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పంట విరామం కూడా ప్రకటించారు. కాలువలకు ముందే నీరు వదిలినా ఇంకా నారు మళ్లు పోసే ప్రయత్నాలూ ప్రారంభించలేదు. ఉప్పునీరు చొచ్చుకురావడంతో నారుమడి పోసినా ఉపయోగం లేదని కొందరు వివరిస్తున్నారు.

విత్తనంపై.. ప్రైవేటు పెత్తనమే : రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచామని ప్రభుత్వం చెబుతున్నా రైతులు అధికంగా సాగు చేసే పత్తి విత్తనం దొరకడం లేదు. అధికశాతం రైతులు ప్రైవేటు దుకాణాల్లో ప్యాకెట్‌ను రూ.1,200 నుంచి రూ.1500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రకాలకు ఎమ్మార్పీపై రూ.400 నుంచి రూ.700 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

రైతు భరోసా కేంద్రాల్లో ఇంకా నిల్వలు రాలేదని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విత్తనం కూడా ఆర్‌బీకేల్లో దొరకడం లేదు. నూనెగింజల పంటలకు ధరలు బాగున్న నేపథ్యంలో పొద్దుతిరుగుడు సాగు చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నా.. విత్తనం అందుబాటులో లేదు.

రాయితీపై 1.87 లక్షల వరి విత్తనం : ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల వరి విత్తనం రాయితీపై అందిస్తున్నామని ఏపీ సీడ్స్‌ ఎండీ జి.శేఖర్‌బాబు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిలోకు రూ.10 రాయితీపై, మిగిలిన జిల్లాల్లో కిలోకు రూ.5 రాయితీపై ఇస్తున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచాం.

ఆర్‌బీకేల్లో పత్తి, మిరప విత్తనాలనూ అందుబాటులోకి తెచ్చాం. 30 పత్తి విత్తన తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రైతు భరోసా కేంద్రాల్లో కర్నూలు జిల్లాలో కొన్నిచోట్ల సోయాబీన్‌ విత్తనాన్ని అమ్మకానికి ఉంచాం’ అని వివరించారు.

జూన్‌ 15వ తేదీ వరకు 65వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి వేశారు. వేరుసెనగ సాగు కూడా సాధారణం కంటే కొంతమేర తగ్గొచ్చనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.