"మధ్యనిషేధమా"?.. మా మ్యానిఫెస్టోలో లేదు: మంత్రి అమర్నాథ్‌

author img

By

Published : Jul 30, 2022, 5:10 PM IST

Updated : Jul 31, 2022, 5:24 AM IST

MINISTER AMARNATH

MINISTER AMARNATH: మద్యపాన నిషేధంపై మంత్రి అమర్నాథ్‌ వింత వివరణ ఇచ్చారు. మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటే లేదని.. మద్యం ధరను ఫైవ్‌స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామన్నారు.

"మధ్యనిషేధమా"?.. మా మ్యానిఫెస్టోలో లేదు

MINISTER AMARNATH: రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించి ‘లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం’ తెస్తామని వైకాపా మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న గుడివాడ అమర్‌నాథ్‌ తాము అలాంటి హామీనే ఇవ్వలేదని అడ్డంగా బుకాయించారు. పైగా ‘మద్యపాన నిషేధం అన్న మాటే మా మేనిఫెస్టోలో లేదు.. కావాలంటే వెళ్లి చూసుకోండి’ అని సవాల్‌ చేశారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌.. తమకు మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిలు, ఖురాన్‌ అని, దానిలోని ప్రతి హామీని తూచ తప్పక అమలు చేస్తామని పదే పదే చెబుతుంటే.. ఆయన కేబినెట్‌లోని మంత్రి మద్యపాన నిషేధం అన్న హామీనే ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. శనివారం విశాఖలోని సర్క్యూట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్‌నాథ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు దానికి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు జోడిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మద్యపాన నిషేధం హామీ అమలుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్‌నాథ్‌ బదులిస్తూ.. ‘మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తామని మేం చెప్పి, చేయకపోతే అప్పుడు ప్రశ్నించండి. మద్యం ధరల్ని ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్థాయికి పెంచుతామని, ఎవరైనా మద్యం ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టే పరిస్థితి తెస్తామని చెప్పాం. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా గోడలపై మా మేనిఫెస్టో ఉంటుంది. దాన్ని చూసుకోండి. మద్య నిషేధం చేస్తామని దానిలో రాసుంటే అప్పుడు అంగీకరిస్తాం’ అని వ్యాఖ్యానించారు.

మద్య నిషేధానికి 0.25 మార్కులే
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు పంచుతున్న కరపత్రంలో మద్యపాన నిషేధానికి సంబంధించి 0.25 మార్కులే వేసుకున్నామని మంత్రి చెప్పారు. ‘మేం పంచుతున్న కరపత్రంలో ముఖ్యమంత్రిగారు ప్రతి పాయింట్‌కు ఒక మార్కు చొప్పున వేశారు. దానిలో మద్యపానానికి సంబంధించి ప్రశ్నకు 0.25 మార్కులే వేసుకున్నాం’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో 45 వేల బెల్ట్‌షాప్‌లు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్ట్‌షాప్‌ కూడా లేకుండా చేశామన్నారు. మా ప్రభుత్వం వచ్చేసరికి 4,500 మద్యం దుకాణాలు ఉండేవని వాటిని 2,900కి కుదించామని తెలిపారు. ‘మద్యంపై వస్తున్న ఆదాయం తగ్గలేదని, అప్పుడూ, ఇప్పుడూ అదే డబ్బులు వస్తున్నాయని, అంతే తాగేస్తున్నారని అనుకోవడం తప్పు. మద్యం వినియోగాల్ని తగ్గించగలిగిన ప్రభుత్వం మాదేనని గర్వంగా చెబుతాం. తాగుబోతుల సంఖ్య తగ్గించాం. మద్యం దుకాణాలు, బార్‌ల సంఖ్య పెంచలేదు’ అని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

మద్యపాన నిషేధంపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే

  • కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది.
  • మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.
  • అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.
  • మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేస్తాం.

ఇవీ చదవండి:

Last Updated :Jul 31, 2022, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.