Karimnagar Cable Bridge: కేబుల్ బ్రిడ్జ్.. కరీంనగర్​కే తలమానికం

author img

By

Published : Jan 11, 2022, 1:20 PM IST

Karimnagar Cable Bridge

Karimnagar Cable Bridge: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్దిదిద్దేందుకు... వేగంగా అడుగులు పడుతున్నాయి. కరీంనగర్‌- వరంగల్ రహదారిలో ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా.. అల్గునూరు బ్రిడ్జిపై ఒత్తిడిని తగ్గించేందుకు తీగల వంతెన నిర్మించి.. రవాణాతో పాటు పర్యాటకంగాను ప్రయోజనం పొందే విధంగా తీర్చిదిద్దుతున్నారు. తీగల వంతెన నిర్మాణం పూర్తి అయినా... అప్రోచ్‌ రోడ్డు కోసం భూసేకరణలో మాత్రం జాప్యం జరుగుతోంది.

Karimnagar Cable Bridge: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి... నగరానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టబోతోంది. నాలుగేళ్ల కిందట రూ. 128కోట్లతో శంకుస్థాపన చేసిన బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 183కోట్లు ఖర్చు చేశారు. 680 మీటర్లు పొడవైన తీగల వంతెనను పూర్తిగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌, హైదరాబాద్‌ వెళ్లే వాహనాలకు సదుపాయం కల్పించడంతో పాటు... పర్యాటకులకు ఆహ్లాదం కలిగించనుంది. మానేరు నదిలో పడవ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో... రెండు వైపులా 220 మీటర్ల ఎత్తులో పైలాన్లు నిర్మించారు. పైలాన్లను 136 సెగ్మెంట్లతో అనుసంధానించారు. ఇప్పటికే ఆ సెగ్మెంట్ల తయారీ నిర్మాణం పూర్తి అయ్యింది. అంతే కాకుండా వంతెన సామర్థ్యాన్ని పరీక్షించే ప్రక్రియ పూర్తి అయ్యింది.

కరీంనగర్​కే తలమానికం...

కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ 2021 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికి... అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదు. జనవరి 2020 నాటికే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి.. కరోనా, వర్షాల కారణంగా ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణభారత దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న తీగల వంతెన.. కరీంనగర్‌ నగరానికే తలమానికంగా నిలవబోతుందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

నిధులు ఎక్కువైనా...

కరీంనగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు.. మానేరు రివర్ ఫ్రంట్‌కు శ్రీకారం చుడుతూనే మరోవైపు తీగల వంతెనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ బ్రిడ్జి కంటే తీగల వంతెనకు 150శాతం నిధులు ఎక్కువైనప్పటికీ ఈ ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. నిర్మాణంలో టర్కీ, మలేసియా, స్విట్జర్లాండ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... టాటా కన్సల్టెన్సీ నిర్మాణం చేపడుతోంది. వంతెన పూర్తి అయితే కరీంనగర్ పర్యాటక ప్రాంతంగా మారడమే కాకుండా.... ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తీగల వంతెన నిర్మాణం పూర్తి అయితే... పెద్దపల్లి, చొప్పదండి వైపు నుంచి ట్రాఫిక్‌ నగరంలోకి ప్రవేశించకుండానే వరంగల్‌కు వెళ్లే ఆస్కారం కలుగుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి.

  • ఇవీ చూడండి:

RGV TWEET: సినిమా టికెట్‌ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.