నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

author img

By

Published : Sep 30, 2022, 11:44 AM IST

Machilipatnam Port

Machilipatnam Port: బందరు పోర్టు ఒప్పందం రద్దు వ్యవహారంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన అప్పీల్లోని అనుబంధ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ జీవోల అమలును నిలిపివేయాలని ఎన్‌ఎంపీఎల్‌ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. అప్పీల్‌పై డిసెంబర్‌ మొదటి వారంలో తుది విచారణ జరుపుతామని తెలిపింది.

Machilipatnam Port: బందరు పోర్టు ఒప్పందం రద్దు వ్యవహారంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎంపీఎల్‌) సంస్థ దాఖలు చేసిన అప్పీల్లోని అనుబంధ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. బందరు పోర్టు పనులను ఇతరులకు అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించాలని, ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో, ప్రాజెక్టు అభివృద్ధి చేసే విధానాన్ని పీపీపీ పద్ధతి నుంచి ల్యాండ్‌లాడ్‌ పద్ధతికి మారుస్తూ ఇచ్చిన జీవోల అమలనును నిలపుదల చేయాలని ఎన్‌ఎంపీఎల్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. అప్పీల్‌పై డిసెంబర్‌ మొదటి వారంలో తుది విచారణ జరుపుతామని తెలిపింది.

మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల(పోర్ట్స్‌)శాఖ ముఖ్య కార్యదర్శి 2019 ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను సవాలు చేస్తూ ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌’ సంస్థ డైరెక్టర్‌ వై.రమేశ్‌ 2019 సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి... వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన ధర్మాసనం తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. పోర్టు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చిన (ఈ ఏడాది ఆగస్టు 25న) తేదీన ప్రాజెక్టు నిర్మాణ విషయంలో లోయస్ట్‌ బిడ్డర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు లెటరు జారీచేసింది. తర్వాత లోయస్ట్‌ బిడ్డర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్యం ఒప్పందం కుదిరింది.

ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మొదట్లో చేసుకున్న ఒప్పంద, ఆ తర్వాత జారీచేసిన జీవో ప్రకారం.. పోర్టు నిర్మాణం కోసం మొత్తం భూమిని ఒక్కసారిగా అప్పగించాలని లేదని పేర్కొంది. పోర్టు అభివృద్ధి కోసం 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తామన్న 2,360 ఎకరాలను ఎన్‌ఎంపీఎల్‌ తిరస్కరించింది. మొత్తం 5,324 ఎకరాలను ఒక్కసారిగా అప్పగించాలని కోరింది. ఒప్పందంలోని క్లాజ్‌ 3.5ని పరిశీలిస్తే.. ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని అప్పగించే కాలపరిమితిని 30 ఏళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. ఆ క్లాజ్‌ను ఎన్‌ఎంపీఎల్‌ సవాలు చేయలేదంది. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సింగిల్‌ జడ్జి.. ఎన్‌ఎంపీఎల్‌ వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాయితీలకు వీలుకల్పించే స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోకపోవడం వల్ల ఫైనాన్షియల్‌ క్లోజర్‌ సాధించలేకపోయామని ఎన్‌ఎంపీఎల్‌ చెబుతున్న వాదన ఆమోదం కాదంది. క్షేత్రస్థాయిలు పనులు ప్రారంభించడానికి ఎన్‌ఎంపీఎల్‌ ప్రతిసారి కొత్త షరుతులు పెడుతోందనడానికి 2017 మార్చిలో రాసిన లేఖ సాక్ష్యమని పేర్కొంది. ఈనేపథ్యంలో స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సహకరించలేదన్న ఎన్‌ఎంపీఎల్‌ వాదన సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కోర్టు ముందున్న వివరాలను పరిశీలిస్తే.. అగ్రిమెంట్‌ ప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్‌ఎంపీఎల్‌ నిర్వహించలేదంది. ఎన్‌ఎంపీఎల్‌ కోరిన విధంగా యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ... అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.