దంచికొట్టిన వర్షం.. స్తంభించిన హైదరాబాద్‌ నగరం

author img

By

Published : Jul 30, 2022, 4:20 PM IST

దంచికొట్టిన వర్షం.. స్తంభించిన హైదరాబాద్‌ నగరం

తెలంగాణలోని హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం దంచి కొట్టింది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురయ్యారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దంచికొట్టిన వర్షం.. స్తంభించిన హైదరాబాద్‌ నగరం

అప్పటిదాకా ఎండ.. పొడి వాతావరణం.. అప్పటికప్పుడు కారుమబ్బులు.. ఒక్కసారిగా కుండపోత.. కొద్దిగంటల్లోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీవర్షం. శుక్రవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొద్ది సమయంలోనే కుంభవృష్టి కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. వరద రోడ్ల మీదకు పోటెత్తి లక్షల మంది వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఉదయం పూట పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీల దాకా అదనంగా పెరగడంతో ఆ వేడికి ఏర్పడిన పీడనం వల్ల మేఘాలు కిందకు వచ్చి ఒక్కసారిగా కొద్దిగంటల్లోనే కుండపోత వర్షం కురిపించాయని.. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో తరచూ ఇలా జరుగుతోందని రాష్ట్ర వాతావరణ అధికారిణి శ్రావణి చెప్పారు.

రాత్రి 9 గంటల వరకు రద్దీ..:శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షం 3.30 వరకు అన్ని చోట్లా విస్తరించింది. సాయంత్రం 5 గంటల వరకు దంచికొట్టింది. దాంతో రోడ్ల మీదకు వరద పోటెత్తి రాత్రి 9 గంటల దాకా గ్రేటర్‌ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు సహా అనుసంధాన రోడ్లలోనూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. వర్షం తగ్గాక పాఠశాలల నుంచి బయటకు వచ్చిన వేల మంది విద్యార్థులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు చింతలకుంటకు వెళ్లిన హోంమంత్రి మహమూద్‌ అలీ కాన్వాయ్‌ వరద ప్రవాహం కారణంగా ఆగిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు అతి కష్టమ్మీద కాన్వాయ్‌ని బయటకు పంపించారు. మరోవైపు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోగులను తీసుకొచ్చే అంబులెన్సులూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

దమ్మాయిగూడలో 10.1 సెంటీమీటర్లు..: శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా హైదరాబాద్‌ నగర శివారులోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో 10.1, నేరేడ్‌మెట్‌లో 9.5, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో 7.3, సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 6.6, ఏఎస్‌ రావునగర్‌లో 6, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 9.7 హయత్‌నగర్‌లో 6.2, పెద్దఅంబర్‌పేటలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తర భారత ప్రాంతాల నడుమ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లోనూ అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని శ్రావణి వివరించారు. శుక్రవారం మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కుండపోత వర్షం కురవొచ్చని తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.