RAINS IN HYD: భాగ్యనగరంలో కుంభవృష్టి.. జనజీవనం అస్తవ్యస్తం

author img

By

Published : Sep 3, 2021, 6:49 AM IST

RAINS IN HYD

హైదరాబాద్‌ వాసులపై మరోసారి వరుణుడు ప్రతాపం చూపించాడు. మూడు గంటల్లో కురిసిన వర్షంతో నగరవాసులు అవస్థలు పడ్డారు. కేవలం 3 గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షం పడటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ మాన్​సూన్​ బృందాలు నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు.

భాగ్యనగరంలో కుంభవృష్టి.. జనజీవనం అస్తవ్యస్తం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వర్షం మూడు గంటలపాటు కురిసింది. కుండపోత వానతో రాత్రి రాజధాని వణికిపోయింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 10సెంటిమీటర్ల వర్షం పడటంతో ఊహించని నష్టం వాటిల్లింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి. రోడ్లన్నీ మునిగిపోయాయి. వాహనాలు పడవల్లా తేలాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి.అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 9.78 సెంటీమీటర్ల వర్షం పడింది.అల్లాపూర్ వివేకానంద్ నగర్ 9.6, మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98, విరాట్ నగర్ 7.93, యూసఫ్​గూడ 7.63, బాలానగర్‌లో 7.15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జీడిమెట్లలో 5.65, కేపీహెచ్​బీ 5.68, షాపూర్ నగర్ 5.48, టోలీచౌక్‌లో 5.25, వనస్థలీపురంలో 5.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నీటమునిగిన వాహనాలు

ఏకధాటిగా కురిసిన వానకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్​ నగర్‌, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్ భవన్ రోడ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌లో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్​పేట మైత్రివనం వద్ద కార్లు నీటమునిగాయి.మూసాపేట,జూబ్లీహిల్స్​, మాదాపూర్​ ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. పాతబస్తీ బహదూర్​పురా వద్ద రహదారులు కనిపించలేదు. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లటంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ భారీగా జాం అయింది.

కొట్టుకుపోయిన తోపుడుబండ్లు

యూసుఫ్ గూడ, శ్రీకృష్ణా నగర్‌లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని స్థానికులు కాపాడారు. కృష్ణానగర్‌లో భారీవర్షానికి వరదలో తోపుడు బండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. నిజాంపేట, మియాపూర్​, బోరబండ, అల్లాపూర్​ డివిజన్​ వివేకానంద నగర్​ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. చింతలకుంట, పనామా కూడలి, సుష్మా చౌరస్తా వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇళ్లలోకి చేరిన నీరు

బషీర్ బాగ్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాల రహదారిపై భారీగా నీరు చేరడంతో... కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరటంతో వస్తువులన్నీ తడిసిపోయాయి. ప్రధాన మార్గాల్లో భారీగా వర్షపు నీరు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ మాన్​సూన్ బృందాలు నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వాన రావడంతో పనుల కోసం బయటికొచ్చిన నగరవాసులు తడిసిముద్దయ్యారు.

ఇదీ చదవండి: ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలేవీ?... నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.