GOVT LANDS : ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములు...తహసీల్దారు కార్యాలయాల్లో మాయాజాలం

author img

By

Published : Sep 23, 2021, 8:41 AM IST

ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములు...తహసీల్దారు కార్యాలయాల్లో మాయాజాలం

వారు చేసేది చిన్న ఉద్యోగం. కొందరు పైఅధికారుల ఉదాసీనం, మరికొందరి అత్యాశ వారిని అవినీతికి పురిగొల్పుతోంది. ఫలితంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. రెవెన్యూ కార్యాలయాల్లో డేటా ఎంట్రీలో అక్రమంగా చేస్తున్న మార్పులతో సర్కారు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలలో వెలుగు చూసిన సంఘటనలు దస్త్రాల గోప్యతపైనా ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రభుత్వ, అసైన్డ్‌, వాగు, కొండ, పోరంబోకు తదితర భూములపై వీఆర్వోలకు పూర్తి అవగాహన ఉండాలి. అసైన్డు భూముల నిషిద్ధ చట్టం-1997, సవరణ చట్టం-2007 ప్రకారం ఇలాంటి భూముల అన్యాక్రాంతం నిషిద్ధం. వీటిపై ఎవరైనా తమ హక్కును కోరుతూ... ఫారం-10 కింద దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి, ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేసి, ఆర్డీవో సంతకం తీసుకోవాలి. అలాంటి భూములను ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో విచారించి తహసీల్దారుకు సిపార్సు చేయాలి. అప్పుడు తహసీల్దారు తన డిజిటల్‌ ‘కీ’ ద్వారా ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేయాలి. ఇవన్నీ జరగకుండానే కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్లు డిజిటల్‌ ‘కీ’ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అధికారులు తమ ఉద్యోగ విరమణ సమయంలో అవినీతికి పాల్పడుతున్నారు.
* నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో దేవాదాయ శాఖకు చెందిన 209 ఎకరాల భూమిని పోర్టుకు ఇచ్చి, పరిహారం పొందారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో భూములన్నీ పోర్టు పేరిటే ఉన్నాయి. అయితే తప్పుడు సర్వే నంబరు సృష్టించి 11 మంది వ్యక్తుల పేర్లతో అడంగల్‌లో మార్పులు చేశారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సస్పెండ్‌ అయ్యారు.
* నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో సుమారు రూ.60 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని ప్రకాశం జిల్లా గుడ్లూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లపై మార్చాడు.
* గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దార్‌ కార్యాలయంలో సరైన దస్త్రాలు లేకుండానే ప్రభుత్వ భూముల సర్వే నంబర్లపై ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లను రాశారు. వెబ్‌ల్యాండ్‌, అడంగళ్‌లో మార్పులు చేశారు. ఈ కేసులో ఆపరేటర్‌పై చర్యలు తీసుకున్నారు. ఇతరులపై విచారణ సాగుతోంది.

రూ.వంద కోట్ల భూములకు ఎసరు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని 17 గ్రామాల్లో ఏకంగా 378.89 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారు. రాజకీయ నాయకులు, కొందరు అధికారుల ఒత్తిళ్లే ఇందుకు కారణమని పోలీసులే స్వయంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్‌ జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొ9చ్చారు. 13 మంది వీఆర్వోలు సస్పెండయ్యారు. మార్కాపురం సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. మరోవైపు జగన్నన కాలనీలు, జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో అసైన్డ్‌ భూములు ఖాళీగా ఉన్నాయి. అసైన్డ్‌, వాగు, కొండ పోరంబోకు భూముల సర్వే నంబర్లు తెలుసుకొని తమ కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తుల పేర్లతో తప్పుడు, అర్హతలేని దరఖాస్తులతో మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక ఇవ్వాల్సిన వీఆర్వోలు... అక్రమార్కులకు సహకరించారు. సరైన దస్త్రాలు లేకపోయినా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కొందరు వీఆర్వోలు సైతం ప్రభుత్వ భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేసుకోవడం గమనార్హం. చివరకు పిల్లల పేరిట డీకే పట్టాలనూ మంజూరు చేశారు. ఇక్కడ అన్యాక్రాంతమైన భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా.

ఇదీచదవండి.

HIGH COURT : 'దేవాదాయ చట్ట నిబంధనలను జీవోలు ఉల్లంఘిస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.