Telangana corona Cases : తెలంగాణపై మరోసారి కరోనా పంజా

author img

By

Published : Jun 22, 2022, 11:58 AM IST

Telangana corona Cases

Telangana Covid Cases: తెలంగాణలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఒక్కరోజులో 400కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Telangana Covid Cases: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఒక్కరోజులో 400కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం 26,704 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 403 మంది కరోనా బారినపడినట్లుగా నిర్ధారణ అయింది. గత 4 రోజులుగా రోజుకు 200కి పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్కసారిగా ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగించే అంశముగా మారింది. తాజా కేసులతో కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య రాష్ట్రంలో 7,96,301కి పెరిగింది.

ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా కేసుల సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,117 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 185 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 14, రంగారెడ్డిలో 19 చొప్పున నమోదయ్యాయి. గత రెండు నెలలుగా జీహెచ్‌ఎంసీలో మినహా జిల్లాల్లో కేసులు దాదాపుగా నమోదు కావడం లేదు. కానీ మంగళవారం నాటి ఫలితాల్లో ఆదిలాబాద్‌(2), భద్రాద్రి కొత్తగూడెం(2), జగిత్యాల(1), జోగులాంబ గద్వాల(1), కరీంనగర్‌(2), ఖమ్మం(1), మహబూబ్‌నగర్‌(1), మంచిర్యాల(2), నాగర్‌కర్నూల్‌(1), నల్గొండ(1), నారాయణపేట(1), పెద్దపల్లి(1), సిద్దిపేట(1), సూర్యాపేట(3), హనుమకొండ(2), యాదాద్రి భువనగిరి(6) జిల్లాల్లోనూ కొవిడ్‌ ఛాయలు మళ్లీ కనిపించడం గమనార్హం.

లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోండి: డీహెచ్‌

తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ వైద్య కేంద్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. లక్షణాలు కనిపించగానే ముందుగా ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా విడి గదిలో ఉండాలని, లక్షణాలు తగ్గే వరకూ ఇదే నిబంధన పాటించాలన్నారు.

వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స పొందాలని జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని డీహెచ్‌ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లోనూ మాస్కు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని కోరారు. పదేళ్ల లోపు చిన్నారులు, 60ఏళ్లు దాటిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తప్పనిసరి అయితేనే బయటకు రావాలని, సాధ్యమైనంత వరకూ ప్రయాణాలను మానుకోవాలని డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.